కరోనా.. దయ లేని వ్యవస్థలో... ఓ తండ్రి దయనీయం... కొడుకు శవంతో...
అతనో సాదాసీదా పెయింటర్... పేద కుటుంబ నేపథ్యం... కుటుంబమంతా అతని పైనే ఆధారపడి ఉంది. అసలే లాక్ డౌన్ కష్టాల్లో ఉన్న ఆ కుటుంబంపై మరో పిడుగు పడింది. ఆ పెయింటర్ కుమారుడు అనుకోని ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగి ట్రీట్మెంట్ చేయించినా ఫలితం లేకపోయింది. చివరికి అతను మృతి చెందాడు. అక్కడితో ఆ తండ్రి కష్టాలకు తెరపడలేదు. దయ లేని వ్యవస్థలో మరింత దయనీయ పరిస్థితులు చుట్టుముట్టాయి.
అసలేం జరిగింది..
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన అస్లమ్ పాషా ఓ సాధారణ పెయింటర్. అతనికి భార్య,ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిన పాషా.. లాక్ డౌన్ పీరియడ్లో పాటు అక్కడే చిక్కుకుపోయాడు. ఎట్టకేలకు లాక్ డౌన్ సడలింపుల తర్వాత కుటుంబం వద్దకు వచ్చాడు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలువ లేదు. కుమారుడు అబ్రర్ అహ్మద్(7) జూలై 2న మెట్ల పైనుంచి కింద పడి గాయాలపాలవడంతో అతనికి కష్టాలు మొదలయ్యాయి.
ఆదివారం బాలుడి మృతి...
చేతిలో డబ్బులు లేకపోవడంతో చుట్టుపక్కలవాళ్ల వద్ద అప్పు చేశాడు. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లు.. ఏ ఆస్పత్రి ఆ బాలుడిని చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు. దీంతో చాలా ఆస్పత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు ఓ ప్రైవేట్ ఆస్పత్రి అడ్మిట్ చేసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. కానీ చికిత్సకు ఆ బాలుడి శరీరం స్పందించలేదు. ఆరోగ్యం మరింత క్షీణించి ఆదివారం(జూలై 5) బాలుడు మృతి చెందాడు.
అంత్యక్రియలకు పోలీసుల అభ్యంతరం..
కుమారుడు మృతి చెందడంతో ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని ఆ తండ్రి భావించాడు. కానీ పోలీసులు వచ్చి పోస్టుమార్టమ్,కరోనా టెస్టులు చేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోస్టుమార్టమ్ రిపోర్ట్ లేనిదే అంత్యక్రియలకు అనుమతించమని చెప్పారు. మృతుడి బంధువు ఒకరు దీనిపై మాట్లాడుతూ.. 'హెబ్బల్ పోలీసులు వచ్చి పోస్టుమార్టమ్ తప్పనిసరి అని చెప్పారు. డెడ్ బాడీ నుంచి స్వాబ్ శాంపిల్స్ తీసుకెళ్లారు. అప్పటివరకూ బాడీని మెడికల్ కాలేజీలో ఉంచాలని కోరగా... అక్కడ ఫ్రీజర్స్ లేవని చెప్పారు. దీంతో ఓ ప్రైవేట్ సంస్థను ఆశ్రయించాల్సి వచ్చింది.' అని చెప్పారు.
Recommended Video
తల్లడిల్లుతున్న ఆ తండ్రి...
ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో రోజుకు రూ.4వేలు చెల్లిస్తూ మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచారు. అసలే పేదరికం... ఇప్పటికే అప్పులు చేసి ఉండటంతో.. రోజుకు రూ.4వేలు ఎలా భరించాలని ఆ తండ్రి తల్లడిల్లుతున్నాడు. 'లాక్ డౌన్ కారణంగా గత 3 నెలలుగా పనిలేదు. కుటుంబం చాలా కష్టాలు పడుతోంది. ఇరుగుపొరుగు ఇచ్చిన అప్పుతోనే ఆస్పత్రి బిల్లు రూ.90వేలు కట్టాను. ఇప్పుడు కొడుకు కూడా పోయాడు. కరోనా టెస్టు రిజల్ట్ ఎప్పుడొస్తుందో తెలియదు. అప్పటిదాకా రోజుకు రూ.4వేలు చెల్లించాలి. ఇప్పటికీ 4 రోజులు గడిచిపోయాయి. ఎవరిని ఆశ్రయించాలో ఏం చేయాలో దిక్కు తోచట్లేదు.' అని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.