విషాదం: రైలు పట్టాలపై ఎమ్మెల్యే కుమారుడి మృతదేహం
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని పాట్నా రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. నలందా మెడికల్ కాలేజీ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభించింది. విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు.. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో ఆ మృతదేహం జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి కుమారుడు దీపక్దిగా గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే భారతి, ఆమె కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేశారని ఆరోపించారు. ముసల్లాపూర్లో ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ ఉందని గురువారం రాత్రి దీపక్ ఇంటి నుంచి వెళ్లాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా, దీపక్ తండ్రి అవ్దేష్ మండల్ బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఆయనకు రాజకీయంగా మిత్రులతోపాటు శత్రువులు కూడా ఎక్కువగానే ఉండటంతో.. ప్రత్యర్థులే దీపక్ను హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎమ్మెల్యే భారతి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దీపక్ హత్యకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.