ఘోరం: టెర్రస్పై నుంచి తోసేసి తల్లిని కడతేర్చిన ప్రొఫెసర్, సీసీటీవీ ఫుటేజీతో..
Recommended Video
గాంధీనగర్: నవమాసాలు మోసి, కనీ పెంచి కొడుకుని ప్రయోజకుడిని చేసింది ఆ తల్లి. కానీ, ఆ కొడుకు మాత్రం వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఎండలో కూర్చోబెడతానంటూ తీసుకెళ్లి భవనంపై నుంచి తోసేశాడు. మొదట అందర్నీ ఆత్మహత్యగా నమ్మించినా.. సీసీఫుటేజీతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాజ్కోట్లోని గాంధీగ్రామ్లో ఓ అపార్ట్మెంట్లో సందీప్ అనే ప్రొఫెసర్ నివాసం ఉంటున్నాడు. అతడి తల్లి జై శ్రీబెన్ అనారోగ్యంతో బాధపడుతోంది. మూడు నెలల క్రితం ఆమె అపార్ట్మెంట్పై నుంచి పడి మృతి చెందింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించిన పోలీసులు ఈ కేసును మూసేశారు.
అయితే, ఓ గుర్తు తెలియని వ్యక్తి తాజాగా రాజ్కోట్ పోలీసులకు ఓ లేఖ రాసి, సీసీటీవీ ఫుటేజీని కూడా అందించాడు. కాగా, గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు పంపించిన సీడీలో.. సందీప్ అపార్టమెంట్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి నమోదైన దృశ్యాలున్నాయి. దీంతో ఈ కేసులో మళ్లీ దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సందీప్ను అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో మొదట అసత్యాలు చెప్పిన సందీప్ ఆ తరువాత నిజాన్ని ఒప్పుకున్నాడు. తన తల్లికి ఆరోగ్యం బాగో లేకపోవడంతో ఆమెను ఆస్పత్రుల చుట్టూ తిప్పలేక విసిగిపోయానని, అందుకే భవనంపై నుంచి తోసేసి హత్య చేశానని తెలిపాడు.