విషాదం: కొడుకు రైలు పట్టాలపక్కన..తల్లి ఇంట్లో ఆత్మహత్య..ఏం జరిగింది?
ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఘటన జరిగిన మరో అరగంటకు ప్రొఫెసర్ తల్లి ఢిల్లీ పీతంపురాలోని తమ నివాసంలో ఉరి వేసుకుని కనిపించింది. మృతులు ఇద్దరు కేరళ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో డబుల్ సూసైడ్
ఓ ఆత్మహత్యకేసులో మృతులు ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని మహిళ భర్త మాజీ భార్య పోలీసులకు తెలిపింది. మృతురాలి భర్త గతేడాది డిసెంబర్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో తల్లీ కొడుకులకు ముందస్తు బెయిల్ లభించింది. ఇక దీనిపై వారు మనోవేదనకు గురై ఉంటారని అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తల్లీ కొడుకుల మీద ఎలాంటి కేసులు లేవని కొట్టాయం ఎస్పీ హరిశంకర్ తెలిపారు. తాము పోలీసు రికార్డులను వెరిఫై చేశామని చెప్పిన ఎస్పీ.. ఆ తర్వాతే ఒక నిర్ధారణకు వచ్చి అదే విషయాన్ని ఢిల్లీ పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు.
ముందుగా తల్లిని హత్య చేసి ఉంటాడా..?
ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు మరో విషయాన్ని బయటపెట్టారు. స్టీఫెన్స్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ముందుగా తన తల్లిని హత్యచేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తల్లి నోట్లోకి కుక్కిన బట్టలు, ఆమె చేతులు కట్టేసి ఉండటం చూస్తే అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. తల్లి మృతి చెందిన గదిలో రెండు కత్తులతో పాటు మలయాళంలో రాసి ఉన్న సూసైడ్నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు చేరుకోగానే అక్కడి పరిస్థితులు గమనించిన తర్వాత హత్య కేసును నమోదు చేశారు. మరోవైపు ప్రొఫెసర్ మృతిపై రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా...
శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం అందడంతో ఘటనా స్థలానికి వెళ్లినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్ శరీరం రెండు ముక్కలైందని తల వేరుపడి ట్రాక్ మధ్యలో పడిందని చెప్పారు. అయితే అతని చేతి వాచ్, పర్సు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా మృతుడికి సంబంధించిన వివరాలను కనుగొన్నట్లు డీసీపీ గుప్తా తెలిపారు. వెంటనే అతని మొబైల్ నుంచి తన సహోద్యోగికి ఫోన్ చేయగా ప్రొఫెసర్ వివరాలు తెలిశాయని వెల్లడించారు.అయితే ప్రొఫెసర్ తల్లి మృతి గురించి తెలియదని మరో సహోద్యోగి ఇంటికి వెళ్లి చూడగా తల్లి ఉరివేసుకుని ఉన్నట్లు కనిపించిందని పోలీసులు తెలిపారు.
కేరళలో క్రిమినల్ కేసు ఉందంటూ...
తమ స్నేహితులు తెలిసినవారు ఇద్దరికీ ఫోన్ చేస్తున్నా ఎవరూ సమాధానం ఇవ్వకపోవడం, ఇద్దరూ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఇద్దరూ మనోవేదనకు గురై ఉండటంతో అనుమానం వచ్చి సాగర్ అనే ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రొఫెసర్ ఫ్లాట్కు వెళ్లాడు. ఇక తలుపు తీయకపోవడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సాగర్ అపార్ట్మెంట్ సెక్యూరిటీని అలర్ట్ చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము కేరళలో క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నట్లు సూసైడ్నోట్లో రాసి ఉందని సాగర్ చెప్పాడు.