బాలికపై గ్యాంగ్రేప్: నిందితుల్లో ఎస్పీ నేత కొడుకు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 14ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో సమాజ్వాది పార్టీ నేత కుమారుడు కూడా ఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదార్ చౌక్ ప్రాంతానికి చెందిన ఓ బాలికను సమాజ్వాదీ పార్టీ నేత టేక్చంద్ పాల్ కుమారుడు ఒమేంద్రపాల్, సురేంద్ర, నరేంద్ర అనే మరో ఇద్దరు యువకులు అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డారు.
శనివారం ఈ ఘటన జరగగా, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. నిందితుల్లో ఒకరైన సురేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
క్షతగాత్రులకు సాయం చేస్తూ... ప్రాణాలు కోల్పోయాడు
ముంబై: ముంబై -పుణె ప్రధాన రహదారిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు యువకులు ప్రకృతి ప్రకోపానికి బలైపోతే, సహాయం చర్యల్లో పాలుపంచుకొంటూ మరోవ్యక్తి హిట్ అండ్ రన్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. క్షతగాత్రులను తరలిస్తున్న క్రమంలో ఆ యువకుడ్ని అతి వేగంగా వచ్చిన కారు బలి తీసుకుంది.
వివరాల్లోకి వెళితే ఖోపాలికి సమీపంలో 20 అడుగుల ఎత్తునుంచి బండరాళ్లు రహదారిపై దొర్లిపడ్డాయి. పెద్దపెద్ద రాళ్లు భారీగా విరుచుకుపడటంతో బైక్ పై వెడుతున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుండగా గణపత్ పాండురంగ(25) అనే యువకుడ్ని వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన గణపత్ని వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.