ఢిల్లీలో స్త్రీలకు రక్షణ లేదు: ఢిల్లీ క్యాబ్ రేప్పై సోనమ్ కపూర్
ముంబై: మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం సంఘటనను బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తీవ్రంగా ఖండించారు. మహిళకు ఢిల్లీలో కన్నా ముంబైలోనే ఎక్కువ రక్షణ ఉందని ఆమె అన్నారు. అది అత్యంత బాధాకరమైన సంఘటన అని, ముంబైతో పోలిస్తే ఢిల్లీలో మహిళలకు రక్షణ లేదని ఆమె అన్నారు. ఖూబ్ సూరత్ చిత్రం డివిడి విడుదల కార్యక్రమంలో ఆమె మంగళవారంనాడు ఆ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో ఉబేర్ కంపెనీ కార్యకలాపాలను నిషేధిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై కూడా ఆమె స్పందించారు. అది క్యాబ్ కంపెనీ తప్పు కాదని, చాలా విషయాల్లో అది ప్రభుత్వ తప్పిదమని, ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్కు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిందని ఆమె అన్నారు. ప్రభుత్వం వైపు నుంచి నిబంధనలు, శిక్ష మరింత కఠినంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రవాణా సంస్థ వాహనంలో అత్యాచారం జరిగితే దాన్ని నిషేధిస్తారా అని ఆమె ప్రశ్నించారు. అది మరో రకంగా పనిచేస్తుందని, చెప్పాలంటే మనిషి ప్రవర్తన మారాలని, వస్తువులను నిషేధించలేమని ఆమె అన్నారు.
శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్లోక్లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్లో పనిచేస్తోంది.
మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు. కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది.
ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.