మోడీ ప్రభుత్వం వచ్చాక..: ఏకిపారేసిన సోనియా గాంధీ
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ పైన, ఎన్డీయే ప్రభుత్వం పైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్డీయే పాలనలో మతఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో మత ఘర్షణలు ఎక్కువగా అవుతున్నాయని, ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలలో ఇవి జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
భారత దేశాన్ని మత ప్రాతిపదికన చీల్చే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో మత ఘర్షణలు చాలా తక్కువగా జరిగాయన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వందలాది మత హింస ఘటనలు జరిగాయన్నారు. విద్రోహ శక్తులను ఎదుర్కోవడానికి అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.
ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో చాలా మత ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. అదే సమయంలో గాజా అంశం పైన కూడా మోడీ ప్రభుత్వం పైన సోనియా మండిపడ్డారు.
లోకసభలో చర్చకు పట్టుబట్టేందుకు తమకు సరైన బలం లేదని, రాజ్యసభలో మాత్రం ఉందని చెప్పారు. తాము పాలస్తీనియన్లకు మొదటి నుండి సంఘీభావం తెలుపుతున్నామన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. మోడీ పాలనలో మత ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శించారు.