మాకు తెలియాలి: సరిహద్దులో ఏం జరుగుతోంది? నిఘా వైఫల్యం కాదా?: సోనియా
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు 20 రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ భద్రతా విషయంలో తామంతా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని అఖిలపక్షం నేతలు స్పష్టం చేశారు.
నిఘా వైఫల్యమే..
అయితే, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అఖిలపక్ష సమావేశం ఇంతకు ముందే జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మనం చీకట్లో ఉన్నామని, కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్రశ్నలున్నాయన్నారు. నిఘా వైఫల్యం కారణంగానే చైనా బలగాలను ముందుగా గుర్తించలేకపోయామన్నారు.
సరిహద్దులో ఏం జరుగుతోంది.. మాకు తెలియాలి..
చైనా బలగాలు ఎప్పుడు దేశంలోకి చొరబడ్డాయి. చైనా సైన్యం అతిక్రమణను ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది. ప్రభుత్వం దగ్గర ఉపగ్రహ చిత్రాలు లేవా? ఈ అసాధారణ కదలికలపై నిఘా వర్గాలు హెచ్చరించలేదా? అని సోనియా కేంద్రాన్ని ప్రశ్నించారు. సరిహద్దుల్లో యథాతథ స్థితి నెలకొంటుందనే భరోసా దేశానికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు సోనియా. వాస్తవాధీన రేఖ వద్ద ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు. సరిహద్దులో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. వారికి సంతాపం తెలిపారు. దేశ భద్రత విషయంలో తాము కేంద్రానికి మద్దతుగా ఉంటామని చెప్పారు.
అదే చైనా ఆగ్రహానికి కారణం: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాశ్మీర్ విషయంలో ప్రధాని వ్యవహరించిన తీరు, కాశ్మీర్కు మోడీ ప్రాధాన్యం ఇవ్వడం చైనాకు ఆగ్రహం తెప్పించి ఉంటుందన్నారు. ప్రధాని పిలుపునిచ్చిన ఆత్మనిర్బర్ భారత్ కూడా చైనాకు ఇబ్బంది పెట్టి ఉంటుందన్నారు. భారత్ ఆర్థిక శక్తిగా ఎదగడాన్ని చైనా తట్టుకోలేకపోతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Recommended Video
వామపక్షాల వాదన మరోలా..
దేశ రక్షణ విషయంలో కేంద్రం తీసుకునే చర్యలకు తాము మద్దతుగా ఉంటామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాగా, తమ కూటమి వైపు మనల్ని తిప్పుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని సీపీఐ నేత డీ రాజా సూచించారు. పంచశీల ఒప్పందం సూత్రాలను గౌరవించాలని సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరీ స్పష్టం చేశారు.