బాధితుడిగా చిత్రీకరించుకుంటున్నారు: మోడీపై సోనియా నిప్పులు, మన్మోహన్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం నిప్పులు చెరిగారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) నేతలు భేటీ అయ్యారు. లోకసభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా నేతలు బీజేపీపై, ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.
మోడీ తనను తాను బాధితుడిగా చిత్రీకరించుకునే ప్రయత్నాలు
పుల్వామా ఉగ్రవాద దాడిని ఉద్దేశించి సోనియా మాట్లాడారు. దేశంలోని ప్రజలంతా పలు అంశాలపై బాధితులుగా మారుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తనను తాను బాధితుడిగా చిత్రీకరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పక్కన పెడుతున్నారన్నారు. మోడీ విధానాలతో ప్రజలు బాధితులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ విధానాలు ప్రజలను బాధించేలా ఉన్నాయన్నారు.
కేంద్రం విధానాల వల్ల జీడీపీ రేటు తగ్గింది
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించారు. అదేవిధంగా ప్రస్తుత పాలనలో పారిశ్రామిక అభివృద్ధిలో వెనుకబాటు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం అంశాలను కూడా ప్రస్తావించారు. యూపీఏ హయాంలో పారిశ్రామిక రంగంతో పాటే వ్యవసాయ వృద్ధి జరిగిందన్నారు. జీడీపీ గురించి ఎన్డీఏ ప్రభుత్వం అసత్య ప్రచారం చేసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల జీడీపీ రేటు తగ్గిందన్నారు.
ప్రజలకు నిజాలు చెబుదామని రాహుల్ గాంధీ అన్నారు
ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మభ్యపెట్టాలని భావిస్తున్నారని కానీ, ఆయనకు ఆ అవకాశం ఇవ్వబోమని ఆనంద్ శర్మ అన్నారు. ప్రజలకు నిజాలను చెబుతామని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. మోడీ హయాంలో దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల హక్కులు నాశనమయ్యాయని, దేశంలో జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకమవుతోందన్నారు.