గవర్నర్ తో ఉద్ధవ్ దంపతుల భేటీ: ప్రమాణానికి సోనియా గాంధీ: శివాజీ పార్కులో..పాతిక వేల మంది సమక్షంలో
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని శివాజీ పార్క్ లో సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు కానుంది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉద్దవ్ తో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ సభ్యులు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.
మహా సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి మోడీ,అమిత్ షా లకు ఆహ్వానం ? ఆసక్తికర చర్చ
గవర్నర్ తో ఉద్ధవ్ దంపతుల భేటీ
తొలుత- వచ్చేనెల 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను బుధవారమే పూర్తి చేయనున్న నేపథ్యంలో జాప్యం చేయడం సరికాదని శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ నిర్ణయించాయి. ఈ ఉదయం ఉద్దవ్ థాకరే తన భార్య రష్మితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ తో మర్యాపూరకంగా సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని ఆయనకు అందజేశారు.
శివాజీ పార్క్ లో.. పాతికవేల మంది సమక్షంలో..
ప్రమాణ స్వీకారం ఇక లాంఛనమే కావడంతో.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆరంభించారు. శివాజీ పార్క్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడ ఏర్పాట్లు సైతం ఆరంభం అయ్యాయి. 25 వేల మందికి పైగా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శివాజీ పార్క్ విశాలమైన మైదానం కావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలకు ఆహ్వానం..
ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలకు ఆహ్వానాన్ని పంపించినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి వారు హాజరవుతారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కీలకమైన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం, భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని దూరం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, దీనికి గాంధీ కుటుంబ సభ్యులు హాజరవుతారని అంటున్నారు.