ఆర్యద్రవిడ అంశాన్ని తెచ్చిన ఖర్గే, మండిపడ్డ సోనియా
ఢిల్లీ: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆమోదించిన రోజును పురస్కరించుకొని గురువారం నాడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం పైన ప్రత్యేక చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆర్య, ద్రవిడ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సోషలిస్ట్, సెక్యులర్ అనే మాటను రాజ్యాంగంలో చేర్చాలనుకున్నారని, అప్పటి వాతావరణంలో ఆ పని కుదరలేదని మల్లికార్జున ఖర్గే అన్నారు. లౌకిక సామ్యవాద అనే పదాల ప్రస్తావన సందర్భంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆర్య, ద్రవిడ వాదాన్ని లేవనెత్తారు.
రాజ్యాంగ రూపకల్పణకు మూడేళ్ల సమయం పట్టిందని సోనియా గాంధీ అన్నారు. అంబేడ్కర్ దూరదృష్టి కలిగిన నేత అన్నారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ఆయన పని చేశారన్నారు. అంటరానితనం నిర్మూలన, సమానత్వం కోసం ఆయన పని చేశారన్నారు.
అత్యంత నిరుపేదలకు గౌరవం దక్కాలని అంబేడ్కర్ కోరుకున్నారన్నారు. ఈ రోజు సుదినం అని, అలాగే దుర్దినం అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాణం వెనుక వీసమెత్తు పాత్ర కూడా పోషించని పార్టీలు ఇవాళ రాజ్యాంగం గురించి లౌకికవాదం గురించి మాట్లాడుతున్నాయన్నారు. రాజ్యాంగ నిర్మాణ సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే భాగం పంచుకుందన్నారు.
ఆనాడు కంటికి కూడా కనబడని పార్టీలు నేడు రాజ్యాంగంలోని అంశాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్నారన్నారు. భారత రాజ్యాంగానికి ఇంతకన్నా అవహేళన మరొకటి ఉండదన్నారు.
రాజ్యాంగంపై చర్చ జరుగుతుండటం సంతోషకరమైన అంశమే అయినప్పటికీ, రాజ్యాంగంలోని ఏ సిద్ధాంతాలు, నిబంధనలతో ప్రేరేపితమయ్యామో వాటిని దూరం చేసేందుకు దాడి జరుగుతుండటం బాధను కలిగిస్తోందని సోనియా అన్నారు.