కాంగ్రెస్ కొత్త చీఫ్గా సోనియాగాంధీ.. అమ్మకే బాధ్యతలు, రాహుల్ రాజీనామాను ఆమోదించిన సీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ : గత కొద్దిరోజులుగా నెలకొన్న స్తబ్ధతకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. రెండు నెలలుగా కొనసాగుతున్న ఊగిసలాడుతున్న చెక్ పెట్టారు. గాంధీయేతర వ్యక్తికి అధ్యక్ష పదవీ కట్టబెడతారని ప్రచారం జరిగినా .. చివరికీ కాంగ్రెస్ పార్టీ దిక్సూచి సోనియా గాంధీకి పగ్గాలు అప్పగించారు. నేతల వినతి మేరకు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కన్నా .. కశ్మీర్ ఇష్యూ సీరియస్ అని మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.
గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీ ఎన్నిక పూర్తయ్యింది. ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ బాస్ పోస్ట్ ఖాళీగా ఉంది. మళ్లీ పగ్గాలు చేపట్టాలని నేతలు కోరినా .. రాహుల్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో సీఎల్పీ విలీనం, గోవాలో సీఎల్పీ విలీనం, కర్ణాటకలో ప్రభుత్వం పడిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో అధ్యక్షుడు లేకుండా పార్టీ ఉండటం సరికాదని అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కోసం ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్ పేర్లు వినిపించినా .. నేతలంతా సోనియా వైపే మొగ్గుచూపారు. కాంగ్రెస్లోని ఐదు కమిటీలు రాహుల్ను అధ్యక్షుడిగా కొనసాగాలని కోరాయి. అయితే అందుకు రాహుల్ నిరాకరించడంతో .. ఎట్టకేలకు సీడబ్ల్యూసీ ఆయన రాజీనామాను ఆమోదించింది. కొత్త అధ్యక్ష బాధ్యతలను సోనియాకు అప్పగించారు.
గాంధీయేతర వ్యక్తి అధ్యక్ష పదవీ చేపట్టాలని రాహుల్ కోరినా .. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు సోనియా మేలని అభిప్రాయానికి వచ్చారు. అయితే సభ్యుల వినతిమేరకు రాహుల్ కూడా సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. తర్వాత మధ్యలోనే వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరుగుతుందని .. ఇవాళ వద్దని తాను చెప్పానని పేర్కొన్నారు. కానీ వారు సమావేశమై రావాలని కోరడంతో వచ్చానని .. దీని కన్నా కశ్మీర్ అంశం సీరియస్ అని దానిపై ఫోకస్ చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు.