సోనియా బాధ్యతల నుంచి పారిపోరు, రాహుల్ని అలా అన్లేదు: షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ నాయకత్వంపై సందేహాలు వస్తున్న కారణంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీనే నాయకురాలిగా కొనసాగాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ అన్నారు. రాహుల్ గాంధీ అసమర్థుడని తాను చెప్పలేదని, అసలు రాహుల్ గురించి తానేం మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆచూకీపై, నాయకత్వ లక్షణాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పిటిఐతో మాట్లాడిన షీలా దీక్షిత్.. ‘బాధ్యతల నుంచి సోనియా పారిపోరు. ఆమె సవాళ్లను ఎదుర్కొంటారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె నాయకత్వంలోనే పునరుజ్జీవం వస్తుంది' అని తెలిపారు. గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ సెలువుపై వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదు.
ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠాన్ని అలంకరిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, దీక్షిత్ కొడుకు, కాంగ్రెస్ పార్టీ నేత కాంగ్రెస్ పార్టీలో జరగబోయే ప్రమోషన్ పార్టీకి పెద్దగా లాభం వచ్చే విషయం కాదని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, వచ్చే వారం ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలకు వ్యతిరకంగా షీలో దీక్షిత్ చేపట్టబోయే ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.