పార్లమెంటరీ నేతగా మళ్లీ సోనియాకే పట్టం.. ప్రజల సమస్యలపై పోరాడతామన్న రాహుల్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న కాంగ్రెస్...శనివారం న్యూఢిల్లీలో భేటీ అయ్యింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎంపీలంతా హాజరు అయ్యారు. ఈ సమావేశంలో తమ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీని ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు సోనియాగాంధీనే పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్నారు. ఇప్పుడు కూడా సోనియాగాంధీనే కొనసాగించాలని ఎంపీలంతా భావించి ఆమెను ఎన్నుకున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగలేనని తేల్చి చెప్పారు. అయితే ఇందుకు హైకమాండ్ ఒప్పుకోలేదు. రాహుల్ కొనసాగాల్సిందిగా పట్టుబట్టింది.
ఈ సమావేశానికి కాంగ్రెస్ తరపున గెలిచిన 52 మంది ఎంపీలు సమావేశం అయ్యారు. రాజ్యసభ ఎంపీలు కూడా సమావేశమయ్యారు.ఇక పార్లమెంటులో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ప్రజల సమస్యలపై పోరాడుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సోనియాగాంధీ నేతృత్వంలో అంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా తనను ఎన్నుకున్న తర్వాత సోనియాగాంధీ 12.13 కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు తెలిపారని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే లోక్సభలో ప్రతిపక్షనేతగా ఎవరు ఉంటారనేదానిపై ఇంకా పార్టీ నిర్ణయించలేదు. దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఈ దఫా ఆయన ఓటమి పాలైనందున ఎవరు ఈ కీలక బాధ్యత తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ప్రతిపక్ష నాయకుడి పాత్రకు సమర్ధవంతమైన నేతను ఎంపిక చేయాల్సిన బాధ్యత సోనియాగాంధీపై ఉంది.
Congratulations to Smt Sonia Gandhi on being elected Leader of the Congress Parliamentary Party. Under her leadership, the Congress will prove to be a strong & effective opposition party, that will fight to defend the Constitution of India. pic.twitter.com/iUcdB51tHE
— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2019
ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ రాజీనామా చేస్తా అని చెప్పడం, కాంగ్రెస్లో అంతర్గత విబేధాలు రావడంతోముగ్గురు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇందులో ఉత్తర భారతం ,తూర్పు భారతం, దక్షిణ భారతం నుంచి నాయకులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే నాలుగో వర్కింగ్ ప్రెసిడెంట్ను పశ్చిమ భారతం నుంచి ఎన్నుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ యువనాయకులను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. జ్యోతిరాదిత్య సిందియా ఇందులో ఒకరు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలుండగా... కేసీ వేణుగోపాల్, మిలింద్ దియోరా పేర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు వినిపిస్తున్నాయి.