మహా సంక్షోభానికి తెరపడేనా..?: కూటమికి సోనియాగాంధీ సూత్రప్రాయ ఆమోదం.. పోస్టుల పంపిణీపై...
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై విడతలవారీగా జరిపిన చర్చలు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. శివసేన-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
మహారాష్ట్ర రాజకీయం: కాంగ్రెస్-శివసేనల మధ్య చర్చలు , ఎన్సీపీ అసంతృప్తి
సోనియా ఆమోదం
కూటమికి సోనియా ఆమోదం తెలిపారని ఎన్సీపీ వర్గాలు ఓ ఆంగ్ల పత్రికకు తెలియజేశారు. సోమవారం సోనియాగాంధీతో శరద్ పవార్ సమావేశమైన సంగతి తెలిసిందే. కాసేపట్లో ఎన్సీపీ చీఫ్ పవార్ కూతురు సుప్రియ సూలేతో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో సమావేశమవుతారు. కనీస ఉమ్మడి ప్రణాళిక గురించి చర్చిస్తారు. తర్వాత మంత్రి పదవులపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు పవార్ నివాసంలో కూడా కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతినిధులు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరపనున్నారు.
నో సీఎంపీ
సోమవారం నాటి సమావేశంలో సోనియాగాంధీతో పవార్ కనీస ఉమ్మడి ప్రణాళిక గురించి చర్చించలేదని తెలుస్తోంది. బలబలాలు, ప్రభుత్వ ఏర్పాటు గురించి మాత్రమే డిస్కస్ చేసినట్టు తెలిసింది. రాజకీయ పరిస్థితులపై చర్చించామని శరద్ పవార్ తెలియజేయగా. సోమవారమే సోనియాగాంధీ ఆమోదం తెలిపారని తెలుస్తోంది.
సావధానంగా..
ప్రభుత్వ ఏర్పాటు అంశంపై తొందరపడకుండా చర్చలు సంయమనంతో జరుగుతున్నాయని ఎన్సీపీ వర్గాలు తెలియజేశాయి. డిసెంబర్ మొదటివారంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సీఎం పదవీ, డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవులపై మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీ స్ఫష్టతనివ్వలేదు. మంత్రి పదవులు మాత్రం సమానంగా పంచుకుంటామని ఆ పార్టీలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
అనిశ్చితి..
గత నెలలో మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసాక, ఫలితాలను కూడా ప్రకటించారు. అయితే ఏ పార్టీ పూర్తి మద్దతు రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. బీజేపీ 105 సీట్ల మధ్య ఆగిపోవడం, శివసేన 50-50 ఫార్ములాను తెరపైకి తీసుకురావడంతో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై పీటముడి నెలకొంది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా విధించిన సంగతి తెలిసిందే.