లోక్సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం: సోనియాగాంధీ ఏంచేశారో తెలుసా..?
Recommended Video
ఢిల్లీ: గురువారం జరిగిన లోక్సభ సమావేశాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన శాఖకు సంబంధించిన పనులు గురించి వివరిస్తున్న సమయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బల్లలు చరుస్తూ ఆయన్ను అభినందించారు. క్వశ్చన్ అవర్ సందర్భంగా నితిన్ గడ్కరీ శాఖకు సంబంధించి రెండు ప్రశ్నలను సభ టేకప్ చేసింది. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు నితిన్ గడ్కరీ. తన శాఖకు సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయో.. దేశంలో రహదారుల విస్తరణకు తన శాఖ తీసుకుంటున్న చర్యలపై నితిన్ గడ్కరీ వివరించారు.
పార్టీలకు అతీతంగా ఇక్కడున్న ఎంపీలందరూ తన పనితీరును ప్రశంసించారని సభలో నితిన్ గడ్కరీ చెప్పారు. వారి నియోజకవర్గాల్లో తన శాఖకు సంబంధించిన పనులు ఏ మేరకు జరిగాయో వారికి తెలుసన్న గడ్కరీ తనను స్వయంగా కలిసి అభినందించారని సభలో చెప్పారు. అదే సమయంలో బీజేపీ ఎంపీలు బల్లలు చరుస్తూ నితిన్ను అభినందించారు. మరోవైపు మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ లేచి నిలబడి నితిన్ గడ్కరీ పనితీరును ప్రతి ఒక్కరం అభినందించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ను కోరారు.
ఇక గడ్కరీ ప్రసంగాన్ని చాలా ఆసక్తితో సోనియాగాంధీ విన్నారు. గడ్కరీ ఇస్తున్న సమాధానాలతో సంతృప్తి చెందిన సోనియాగాంధీ అప్పుడప్పుడు తన తలను ఊపుతూ కనిపించారు. అంతేకాదు బల్లను కూడా చరుస్తూ కనిపించారు. సోనియాగాంధీ బల్లను చరిచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అభినందించడం చూసి ఇతర కాంగ్రెస్ సభ్యులు కూడా బల్లను చరిచి గడ్కరీని అభినందించారు.
గతేడాది తన నియోజకవర్గం రాయ్బరేలీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకొచ్చారు సోనియాగాంధీ. అయితే వెంటనే రహదారుల మరమత్తులను చేయించడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు సోనియాగాంధీ. అంతేకాదు ఇంటిని చక్కబెట్టలేని వ్యక్తి దేశాన్ని చక్కబెట్టలేడంటే ఈ మధ్యకాలంలో నితిన్ గడ్కరీ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఆ మాట చెప్పేందుకు ధైర్యం కావాలని చెప్పిన రాహుల్ గాంధీ రాఫెల్ ఒప్పందంపై కూడా నితిన్ గడ్కరీ నోరు విప్పాలని కోరారు.