తెలంగాణపై సోనియా పట్టు: కేంద్ర మత్రుల భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెసు అధ్యక్షురాలు పట్టుతో ఉన్నారని తెలుస్తోంది. శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రతిపాదించాలని ఆమె పట్టుపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యలో కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు ఎకె ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, పి. చిదంబరం, జైరాం రమేష్లతో పాటు అహ్మద్ పటేల్ సోమవారం సాయంత్రం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు ముసాయిదాపై వారు సోనియాతో చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రవేశపెట్టకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, మొదటికే మోసం వస్తుందని సోనియా గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ బిల్లుపై రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయం చెప్పడానికి కనీసం రెండు వారాలైనా సమయం ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటున్నట్లు చెబుతున్నారు. అయినా సరే, శీతాకాలం సమావేశాల్లోనే బిల్లు వచ్చేలా చూడాలని సోనియా అంటున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బిల్లును ప్రత్యేక సమావేశాలకో, మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలకో వాయిదా వేయడం మంచిది కాదని, అలా వాయిదా వేస్తే అడ్డంకులు తీవ్రం కావచ్చునని సోనియా చెబుతున్నట్లు సమాచారం. తెలంగాణ బిల్లును వాయిదా వేయడం వల్ల ఉపయోగం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఇంత దూరం వచ్చిన తర్వాత వెనకడుగు వేసినట్లు వాయిదా వేయడం మంచిది కాదని సోనియా బృందం వాదిస్తున్నట్లు తెలుస్తోంది.
వాయిదా వేస్తే తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందనే సంకేతాలు వెళ్తాయని, దీన్ని సమైక్యవాదులు తమ విజయంగా ప్రకటించి మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందని, దాంతో తెలంగాణలో పరిస్థితులు విషమించే ప్రమాదం ఉంటుందని సోనియా అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. డిసెంబర్ 5వ తేదీన పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ప్రారంభమై 20వ తేదీ వరకు జరుగుతాయి. పది రోజులు సమావేశాలు జరగవచ్చు.
ఇప్పుడు బిల్లును వాయిదా వేసి, బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుంటే బిజెపి తన వ్యూహాన్ని మార్చుకుని అడ్డం తిరిగితే ప్రమాదం వాటిల్లుతుందని కూడా సోనియా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ బిల్లును ప్రతిపాదించవచ్చునని బిజెపి వాదిస్తే ఇబ్బంది ఎదురవుతుందని ఆమె అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ఆమోదం పొందే విధంగా ప్రతిపాదించలేకపోయినా, కనీసం ప్రతిపాదించి ఆ తర్వాత ఆమోదం కోసం చూడవచ్చునని కూడా అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, సమయం ముంచుకొస్తున్న కొద్దీ కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ప్రక్రియపై వేగంగా కదులుతున్న సూచనలే కనిపిస్తున్నాయి.