మే 17 తర్వాత ఏంటీ? ఎలా?: కేంద్రానికి సోనియా గాంధీ ప్రశ్నలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్డౌన్ ఇంకెంత కాలం కొనసాగిస్తారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం సమావేశమై కరోనావైరస్ పరిస్థితులపై ఆమె చర్చించారు.
కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?
మే 17 తర్వాత ఏంటీ? మే 17 తర్వాత ఎలా? ఏ ప్రమాణాల ఆధారంగా కేంద్రం ఇంకెంత కాలం లాక్డౌన్ను పొడిగిస్తుందని అని సోనియా గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. మే 17న మూడో దశ లాక్డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ 3.0 తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నామని అన్నారు. కరోనావైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వలస కూలీల సమస్యలు, వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వెనక్కు తీసుకురావడానికి చర్యలపై సోనియా పార్టీ నేతలతో చర్చించారని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తాము తీసుకుంటున్న చర్యల గురించి సోనియా గాంధీకి వివరించారు. ప్రధాన మంత్రిని సాయం కోరుతున్నామని, కేంద్రం సాయం కోసం ఎదురు చూస్తున్నామని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. కాగా, ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సోనియా గాంధీ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.