మోడీ, షాను మట్టుబెట్టాలని చూశారు.. సోనియా, రాహుల్పై రాందేవ్ బాబా సంచలన ఆరోపణలు
యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. యూపీఏ హయాంలో తమ ప్రత్యర్థులను అణచివేసేందుకు కఠినచర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రధాన ప్రత్యర్థులైన నరేంద్ర మోడీ, అమిత్ షాను హతమార్చేందుకు కూడా ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాం దేవ్ బాబా కామెంట్స్ దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
చంపాలని చూశారు
యూపీఏ హయాంలో చీఫ్ సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చుట్టూ అధికారం కేంద్రీకృతమైందని వివరించారు. ఆ సమయంలో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, మోడీ అనుచరుడు అమిత్ షాను మట్టుబెట్టేందుకు సోనియా, రాహుల్ ప్రయత్నించారని రాందేవ్ బాబా హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం యూపీలోని నోయిడాలో కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు రాం దేవ్ బాబా. ఆ సందర్భంలోనే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసుతో అమిత్ షాను జైలుకు పంపిన రాహుల్ గాంధీ .. జైలులోనే హతమార్చాలని చూశారని ఆరోపించారు.
కుట్ర పన్నారు
గాంధీ కుటుంబసభ్యులెవరు మోడీ-షా ద్వయాన్ని చంపేయాలని చూశారని రాందేవ్ బాబా ఆరోపించారు. కానీ మోడీ-షా అలా చేయడం లేదన్నారు. వారు కూడా అలానే ప్రవర్తిస్తే సోనియా-రాహుల్ పరిస్థితి ఏంటి అని కామెంట్ చేశారు. తర్వాత మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరంపై కూడా రాందేవ్ బాబా విరుచుకుపడ్డారు. అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం అమిత్ షాను జైలుకు పంపారని గుర్తుచేశారు. జైలుకు మోడీని పంపించి హతమార్చాలని కూడా చూశారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో అమిత్ షాను జైలులో పెట్టిన చిదంబరం .. తాను కూడా జైలుకు వస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు.
ఇప్పుడు వారే
కానీ ఇవాళ సోనియా, రాహుల్ కూడా చట్టం ముందు సమానులేనని రాందేవ్ బాబా అన్నారు. పీ చిదంబరం కూడా చట్టం ముందు సమానమేనని పేర్కొన్నారు. అందుకే ఆయ ఐఎన్ఎక్స్ కేసులో జైలులో ఉన్నారని పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమించొద్దని జస్టిస్ హెగ్డే తనతో చెప్పారని గుర్తుచేశారు. ఒకవేళ మనం చట్టాన్ని ఉల్లంఘిస్తే .. ఎప్పుడో ఒకప్పుడు చట్టం ముందు అడ్డంగా దొరికిపోతామని చెప్పారు. ఇప్పుడు చిదంబరం పరిస్థితి కూడా అదేనని చెప్పారు. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యం తనదేనని భావించారని పేర్కొన్నారు. అలాగే హోం మంత్రిగా ఉన్నప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని .. కానీ ఇప్పుడు ఆయన జైలులో ఉన్నారని పేర్కొన్నారు.
జైలులో చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తీహర్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. చిదంబరాన్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో .. రిమాండ్ ఖైదీగా తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం తీహర్ జైలులో సాధారణ ఖైదీగా చిదంబరం ఉన్నారు.