మార్చ్: మత అసహనంపై రాష్ట్రపతికి సోనియా విజ్ఞప్తి
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాందీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని వారు రాష్ట్రపతిని కోరారు.
రాష్ట్రపతి రాజ్యాంగ అధికారాల్ని ఉపయోగించి దేశంలో ఉన్న మత అసహన వాతావరణాన్ని సరిదిద్దాలని వారు విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీ నాయకత్వంలో రాష్ట్రపతిని కలిసిన వారిలో మన్మోహాన్, రాహుల్తో సహా 11 మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రాష్ట్రపతిని కలిసి మెమొరాండం సమర్పించిన అనంతరం సోనియాగాంధీ మాట్లాడుతూ దేశంలో ఆహారపు అలవాట్లు, సాహితీకారులపై జరిగే దాడులను సమర్థించే విధంగా ప్రధాని మోడీ మౌనం ఉందన్నారు.
అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. మన దేశంలో జరుగుతున్న ఘటనలపై భారతీయులుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ సరైన దిశలో పయనించడం లేదని అన్నారు. దేశంలో ప్రతి సంఘటనపై ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదనే బీజేపీ వాదన అంగీకార యోగ్యమైనా, మనుషులు మరణిస్తుంటే ప్రధాని స్పందించకపోతే ఎలా? అన్నారు.
దేశంలో మతం ముసుగులో మనుషులను తగలబెట్టేస్తుంటే, కొట్టి చంపేస్తుంటే ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశంలో ఏం జరగడం లేదని వ్యాఖ్యానించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజధాని ఢిల్లీకి సమీపంలో జరిగిన సంఘటనలపై స్పందించకపోతే, మారుమూల జరిగే సంఘటనలపై ప్రధాని ఎలా స్పందిస్తారన్నారు.
అంతకముందు దేశంలో పెరుగుతున్న మత అసహనానికి నిరసగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ర్యాలీని నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ ఎదుట భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. అనంతరం పార్లమెంట్లోని గాంధీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ మార్చ్ చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ ర్యాలీలో సోనియా గాంధీ, మన్మోహాన్ సింగ్, రాహుల్గాంధీ, ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, ఆనంద్శర్మ సహా కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. వీరితో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ మార్చ్కు వ్యతిరేకంగా సిక్కులు ఆందోళన చేపట్టారు. సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో విజయ్ చౌక్ వద్ద పోలీసులు సిక్కులను అడ్డుకుని అరెస్ట్ చేశారు.