శివసేనకు మద్దతు ఇచ్చే ఛాన్సే లేదంటోన్న కాంగ్రెస్..అదే దారిలో ఎన్సీపీ: థాకరే పరిస్థితేంటీ?
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లభించిన అవకాశాన్ని కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జార విడుచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ కూడా ఇదే మాటను వినిపిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షంలో కూర్చోవడానికే తాము ప్రాధాన్యత ఇస్తామని ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్ అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై శివసేన నోరు మెదపట్లేదని, భారతీయ జనతాపార్టీతో తెగదెంపులు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఏర్పాటు దిశగా: గవర్నర్ తో భేటీ కానున్న శివసేన: ఛాన్స్ ఇస్తారా?
అటు దేవేంద్ర.. ఇటు శరద్ పవార్
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పీటముడి పడిన నేపథ్యంలో.. బీజేపీ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వేర్వేరుగా హస్తినకు చేరిన విషయం తెలిసిందే. సోమవారం వారిద్దరూ తమ అధిష్ఠాన పెద్దలను కలుసుకున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. అదే సమయంలో- అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో శరద్ పవార్ భేటీ అయ్యారు. మూడు గంటల పాటు వారి మధ్య చర్చలు కొనసాగాయి.
సంప్రదాయ ఓటు బ్యాంకు దూరమౌతుందనే..
శివసేనకు మద్దతు ఇవ్వడం వల్ల తలెత్తే పరిస్థితులపై ప్రధానంగా చర్చ కొనసాగింది. మతతత్వ పార్టీగా ముద్రపడిన శివసేనకు మద్దతు ఇవ్వడం వల్ల లౌకిక పార్టీ అనే ముద్రను చేజేతులా పోగొట్టుకున్నవాళ్లమౌతామని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. మైనారిటీలు, దళితుల ఓటు బ్యాంకుతో పాటు తటస్థ ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని, వారు పార్టీకి దూరమౌతారనే వాదనలను పలువురు కాంగ్రెస్ సీనియర్లు వ్యక్తం చేశారని అంటున్నారు. సంప్రదాయ బద్ధంగా కాంగ్రెస్ కు దశాబ్దాల నుంచీ వెన్నుదన్నుగా ఉంటూ వస్తోన్న ఓటర్లు పార్టీ పట్ల విముఖతను చూపుతారని, దీని ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుందని సోనియాగాంధీకి వివరించారని తెలుస్తోంది.
ఫలితం తేలని తొలి భేటీ..
పరిస్థితులన్నింటినీ అంచనా వేసిన తరువాత శివసేనకు మద్దతు ఇవ్వకూడదనే ప్రాథమిక నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సోమవారం రాత్రి పొద్దు పోయేంత వరకూ కొనసాగిన ఈ సమావేశం సందర్భంగా ఎలాంటి కీలక నిర్ణయాన్ని తీసుకోలేదని, కొనసాగింపుగా మరోమారు సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సమావేశాల తీవ్రతను చాటుతోందని అంటున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షంగా కొనసాగుతున్నందున సోనియాగాంధీ తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని ఎన్సీపీ నేతలు స్పష్టం చేశారు.
శివసేన పరిస్థితేంటీ..?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేళ్ల పాటు పంచుకోవాలనే ప్రతిపాదనలపై భీష్మించుకుని కూర్చున్న శివసేన పరిస్థితేమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి గనక ప్రతిపక్షంలో కూర్చోవడానికే మొగ్గు చూపితే.. శివసేన ఒంటరిగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. లేదా- గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీతో జట్టు కట్టాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఈ రెండింట్లో ఏది జరిగినా శివసేన పరువు పోగొట్టుకున్నట్టవుతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి పరిస్థితి నిజంగా ఎదురైతే.. బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా శివసేనకు ఇవ్వకపోవచ్చని అంటున్నారు.