Assembly elections: సోనియా తొలి సభ రద్దు: ఆమె బదులు రాహుల్, అనారోగ్యమే కారణమా?
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏకైక బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే, అనారోగ్య కారణాల వల్లే ఆమె ఆ సభలో హాజరుకావడం లేదని సమాచారం. దీంతో సోనియా గాంధీ బదులు మహేందర్గఢ్లో నిర్వహించే ర్యాలీతోపాటు బహిరంగసభలోనూ రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
సోనియా బదులు రాహుల్
ఆగస్టులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ తిరిగి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాల్గొనే సభ కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఇప్పుడు ఆమె ఈ ర్యాలీ, సభలో పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
ట్వీట్ చేసి డిలీట్..
ఈ క్రమంలో సోనియా గాంధీ బదులు రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ, సభలో పాల్గొంటారని.. సోనియా గాంధీ అందుబాటులో ఉండని కారణంగానే ఈ మేరకు నిర్ణయించడం జరిగిందని ట్వీట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పేర్కొంది. ఆ తర్వాత ఆ ట్వీట్ను డిలీట్ చేయడం గమనార్హం. బీజేపీ మంత్రి రామ్ బిలాస్ శర్మకు ప్రత్యర్థిగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావు దాన్ సింగ్ తరపున సోనియా గాంధీ ప్రచారం చేయాల్సి ఉంది.
మహారాష్ట్రలోనూ ప్రచారం..
మహారాష్ట్రలోనూ ఆమె పలు బహిరంగసభల్లో పాల్గొనాల్సి ఉంది. అక్టోబర్ 21న హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి. హర్యానాతోపాటు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. హర్యానా, మహారాష్ట్రల్లోనూ బీజేపీనే అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో శివసేనతో కలిసి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే.. ఎన్సీపీతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది.