మోదీ ఆర్థిక ప్యాకేజ్ ఓ క్రూరమైన హాస్యం వంటిది..!మతిలేని ఆంక్షల వల్ల ఏం సాధించారన్న సోనియా గాంధీ..!!
ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ తో స్తబ్దుగా మారిన అన్ని వ్యవస్దలలాగే రాజకీయ వ్యవస్థ కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు లేకుండా ఇంతకాలం నిశ్శబ్దంగా ముందుకు సాగింది. తాజాగా లాక్డౌన్ ఆంక్షలను సడలించడం, రెడ్ జోన్లలో కొన్ని మినహాయింపులివ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈ ప్యాకేజీని ప్రకటించారని తెలుస్తోంది. ఐతే 20లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల పైదవాడికి ఒరిగేదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది. ముందు చూపు లేని లాక్డౌన్ ఆంక్షల వల్ల అనేక మంది జీవనోపాది కోల్పోయారని, మోదీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ ద్వారా వారికి ఎంలాంటి మేలు జరుగుతుందని ఆమె సూటిగా ప్రశ్నించారు.
మే 17 తర్వాత ఏంటీ? ఎలా?: కేంద్రానికి సోనియా గాంధీ ప్రశ్నలు
కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన విపక్ష పార్టీల విడియో సమీక్ష.. మోదీ ప్యాకేజీ పై మండిపడ్డ సోనియా గాంధీ..
అంతే కాకుండా ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ క్రూరమైన హాస్యంలా ఉందని చమత్కరించారు సోనియా గాంధీ. కరోనా వైరస్ కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ పై అసహనం వ్యక్తం చేసారు. ఈ ఆర్థిక ప్యాకేజీ వల్ల ఎవరికి ఉపయోగమని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. కరోనాను ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానమంటూ లేదని ఆమె ఆరోపించారు. ఎలాంటి సంసిద్దత లేకుండా లాక్డౌన్ అమల్లోకి తేవడం, దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక మోదీ ప్రభుత్వం అయోమయ విధానాలను తెరమీదకు తీసుకొచ్చిందని సోనియా గాంధీ విరుచుకుపడ్డారు.
ఆర్ధిక ప్యాకేజీ వల్ల ఒరిగేదేమీ లేదు.. మోదీ ప్యాకేజీ ఓ క్రూరమైప నవ్వులాంటిదన్న సోనియా..
అంతే కాకుండా శుక్రవారం మధ్యాహ్నం జరిగిన జాతీయ స్థాయి విపక్షాల సమావేశంలో సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. బీజేపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై సోనియా ఘటు విమర్శలు చేశారు. మార్చి 24 వ తేదీన కేవలం 4 గంటల వ్యవధిలో లాక్డౌన్ ప్రకటించారని, ఎలాంటి సంసిద్ధత లేకుండా లాక్డౌన్ అమల్లోకి తెచ్చారని, అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని గుర్తు చేసారు శ్రీమతి సోనియా గాంధీ. 21 రోజుల మొదటి విడత లాక్డౌన్తో సత్ఫలితాలు వస్తాయనుకున్నా ఆశించినా అలా జరగలేదని, కేవలం స్వీయ నియంత్రణ కఠినంగా అమలు చేస్తే వ్యాక్సిన్ కనిపెట్టే వరకు ప్రజలు సురక్షితంగా ఉండే వారని సోనియా అభిప్రాయపడ్డారు.
ముందుచూపు లేకుండానే లాక్డౌన్ ప్రకటించారు.. రోడ్డుపాలైన నిరుపేదలకు భరోసా ఎవరిస్తారన్న సోనియా..
అంతే కాకుండా ప్రభుత్వం 4.0 లాక్డౌన్ అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వానికి బయటపడే విధానం అగమ్యగోచరంగా మారిందని, వరుస లాక్డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయని సోనియా ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈలోగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉందని విచారం వ్యక్తం చేసారు. దాంతో పాటు ప్రధాని ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజి ఓ క్రూరమైన హాస్యం వంటిదని సోనియా చిత్రీకరించారు. కరోనా మహమ్మారికి తోడు లాక్డౌన్ ఆంక్షల వలస కూలీలు బ్రతుకులు ఛిద్రమైపోయాయని, వారి సమస్యలకు బాద్యులు ఎవరని ప్రశ్నించారు. వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కరోనా కట్టడిలో కేంద్రం తప్పులు చేసింది.. ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విపక్ష పార్టీలు..
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన విపక్షాల సమావేశానికి ముందుగా ఊహించినట్టే మూడు పార్టీలు గైర్హాజరయ్యాయి. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వీడియో సమీక్ష సమావేశానికి దూరంగా వున్నాయి. యూపీఏ కూటమిలోని ప్రధాన పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవర్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, డిఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్, ఉమర్ అబ్దుల్లా, సీతారామ్ ఏచూరీ, ప్రొ.కోదండరామ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనా వైరస్ కట్టడికి బీజేపి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు ఆమోదయోగ్యంగా లేవని, నిరుపేదలు, వలస కార్మికులు, దినసరి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని విపక్ష పార్టీల నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.