ఒత్తిళ్లకు లొంగం: పోరాటం కొనసాగుతుందన్న సోనియా
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకిత్తించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. బెయిల్ మంజూరైన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు భయపడేది లేదని చెప్పిన ఆమె, రాజకీయ ప్రతీకార చర్యనూ ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. మా మార్గం నుంచి మమ్మల్ని ఎవరూ తప్పించలేరన్నారు. దేశ పౌరులుగా ఏం చేయాలో అదే చేశామన్నారు.
ఈ దేశంలో రాజ్యాంగ్ అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తుందని, అందులో తనకు ఎలాంటి సందేహం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మాపై అన్నిరకాల అస్త్రాలను ఉపయోగించిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం మాపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు.
అనంతరం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మాపై తీవ్ర ఒత్తడి తేవాలని ప్రయత్నించారన్నారు. కానీ ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగేది లేదని, ప్రజల కోసమే మా పోరాటం కొనసాగుతుందన్నారు. మాపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రతిపక్షంగా మా పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఒత్తిళ్ల ద్వారా ప్రతిపక్షాలను అణిచివేయలేదని మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన భావజాలాన్ని ఎప్పటికీ వదిలేయదన్నారు. మీడియా సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరైంది. సోనియా, రాహుల్ గాంధీల తరుపున మాజీ ప్రధాని మన్మోసింగ్, అహ్మాద్ పటేల్ బెయిల్ పత్రాలు సమర్పించారు.
పాటియాలో కోర్టులో నేషనల్ హెరాల్డ్ కేసును విచారించిన రెండో మెట్రోపాలిటన్ జడ్జి లవ్లీసింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్కు 50వేల పూచీకత్తుతో బెయిల్ మంజారు చేశారు. ఈ కేసు రెండో విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసు విచారణను కేవలం 3 నిమిషాల్లోనే ముగియడం విశేషం.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన సోదరి ప్రియాంక బెయిల్ బాండ్లను సమర్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లకు ఎలాంటి షరతులు లేని బెయిల్ను పాటియాలా కోర్టు మంజారు చేసిన సంగతి తెలిసిందే.