మోడీ కంటే ముందే: జాతిని ఉద్దేశించి సోనియాగాంధీ ప్రసంగం: దేశభక్తి ప్రదర్శించే సమయం ..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ చివరి రోజు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి కొన్ని గంటల ముందే.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓ వీడియో సందేశాన్ని పంపించారు. జాతిని ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగంతో కూడిన వీడియో ఇది. అయిదు నిమిషాల 45 సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియోను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఫ్రంట్లైన్ వారియర్లుగా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. కరోనాపై దేశం కొనసాగిస్తోన్న యుద్ధాన్ని వారంతా ముందుండి నడిపిస్తున్నారని కొనియాడారు. హెల్త్ వర్కర్లను ఫ్రంట్లైన్ వారియర్లుగా అభివర్ణించారు. కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పేషెంట్ల ప్రాణాలను నిలబెట్టడానికి వారంతా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని చెప్పారు. వారి సేవలు అనిర్వచనీయమని అన్నారు.
కుటుంబాలను వదిలి..
కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన వేళ.. పోలీసులు, డాక్టర్లు తమ కుటుంబాలను సైతం వదిలి విధి నిర్వహణలో పాల్గొంటున్నారని, అసలైన దేశభక్తిని ప్రదర్శించారని అన్నారు. దేశం పట్ల తమ రుణాన్ని తీర్చుకునే సమయాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. ప్రతి పౌరుడు కూడా తన దేశభక్తిని చాటుకోవడానికి ఇంతకంటే మంచి సమయం రాకపోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు ఇళ్ల వద్దే ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రిచడానికి సహకరించాలని సూచించారు. వారిని గౌరవించుకుందామని అన్నారు.
కరోనాను జయించగలం..
కరోనా వైరస్ను జయించడానికి దేశ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చారని, ఈ యుద్ధంలో భారత్ విజయం సాధిస్తుందనే విశ్వాసం తనకు ఉందని అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్లో కరోనా వైరస్ తీవ్రత మిగిలిన దేశాల స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం.. దేశప్రజల ఐక్యతేనని సోనియాగాంధీ చెప్పారు. కరోనాపై సాగిస్తోన్న పోరాటంలో అంతిమ విజయం తమదేనని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
డాక్టర్లపై దాడులు సరికాదు..
కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడటంలో అహర్నిశలు కృషి చేస్తోన్న డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్పై కొందరు దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇది సరికాదని అన్నారు. విధి నిర్వహణలో ఉంటోన్న డాక్టర్లు, పోలీసు కానిస్టేబుళ్లపై దాడులు చేయడం క్షమార్హం కాదని చెప్పారు. అలాంటి వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని అన్నారు. దీనివల్ల వేరొకరు అలాంటి అవాంఛనీయ దాడులకు దిగబోరని అన్నారు. 21 రోజుల లాక్డౌన్ సందర్భంగా దేశ ప్రజలు సమన్వయంతో వ్యవహరించారని కితాబిచ్చారు.
Recommended Video