ఎట్టకేలకు రెబల్స్తో భేటీ కానున్న సోనియా.. ఎజెండా ఇదే... కీలక నిర్ణయాలు ఉంటాయా?
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శనివారం(డిసెంబర్ 19) అసమ్మతి నేతలతో సమావేశం కానున్నారు. వరుసగా రెండు రోజుల పాటు పార్టీ సీనియర్లతో సోనియా సమావేశమవుతారు. ఈ ఏడాది అగస్టులో కాంగ్రెస్కి చెందిన 23 మంది సీనియర్లు పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన అవసరమని పేర్కొంటూ సోనియాకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖపై అప్పట్లో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీనియర్ల లేఖ తెరపైకి వచ్చిన దాదాపు 4 నెలల తర్వాత సోనియా వారితో సమావేశం కానుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోనియా వారితో ఏం చర్చించనున్నారు.. కీలక నిర్ణయాలేమైనా తీసుకోబోతున్నారా వంటి అంశాలపై చర్చ జరుగుతోంది.
ఏఐసీసీ ఎన్నికపై ఊహాగానాల నేపథ్యంలో...
పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించిన ఆ 23 మంది సీనియర్ నేతలతో సోనియా ముఖాముఖి సమావేశం కానున్నారు. శనివారం ఉదయం 10గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సంధానకర్తగా వ్యవహరించనున్నారు.పార్టీకి తాత్కాలిక అధ్యక్షులు కాకుండా పూర్తి కాలపు అధ్యక్షుడు ఉండాలని నాలుగు నెలల క్రితం రాసిన లేఖలో సీనియర్లు అభిప్రాయపడ్డారు. అలాగే పార్టీలో ఏఐసీసీ,సీడబ్ల్యూసీ సహా అన్ని స్థాయిల్లోని పదవులకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలో ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అసమ్మతి నేతలతో సోనియా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎవరెవరు హాజరుకానున్నారు...
శనివారం జరగబోయే సమావేశానికి పార్టీ కీలక నేతలు గులాం నబీ ఆజాద్,కపిల్ సిబల్,మనీష్ తివారీ,శశి థరూర్,ఆనంద్ శర్మ,వీరప్ప మొయిలీ,పృథ్వీరాజ్ చవాన్ తదితర నేతలు హాజరుకానున్నారు. అసమ్మతి నేతలతో సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అధిష్టానం గౌరవిస్తుందని.. అసమ్మతి నేతల అభిప్రాయాలను కూడా పార్టీ గౌరవిస్తుందన్న సంకేతాలను సోనియా పంపించనున్నారు. అసమ్మతి నేతలతో పాటు మన్మోహన్ సింగ్,పి.చిదంబరం,అశోక్ గెహ్లాట్ తదితర సీనియర్ నేతలతోనూ సోనియా మంతనాలు జరపనున్నారు. పార్టీలో వేర్వేరు గ్రూప్స్ ఏమీ లేవని... ప్రతీ నేతను,కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబం లాగే భావిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. సోనియా ప్రత్యేకించి రెబల్స్తో సమావేశం కావట్లేదని... పార్టీ సీనియర్లందరితో సమావేశం అవుతున్నారని స్పష్టం చేశారు.
ఇదే ఎజెండా...
ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా పతనం కావడం,హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పూర్తిగా గల్లంతవడం,కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంపై సోనియా గాంధీ పార్టీ సీనియర్లతో చర్చించే అవకాశం ఉంది. అలాగే రైతుల ఆందోళనలపై చర్చించనున్నారు. ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించట్లేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో దానిపై అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారు. అలాగే త్వరలో ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్,తమిళనాడు,అసోం రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ల సలహాలు,సూచనలు తీసుకోనున్నారు. ఇక పార్టీలో నాయకత్వ ప్రక్షాళనకు సంబంధించి కూడా కీలక చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.