కోలుకుంటున్నారు: సోనియా భుజానికి ముంబై డాక్టర్ ఆపరేషన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నియోజకవర్గమైన వారణాసిలో రోడ్ షో సందర్భంగా అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. రోడ్ షోలో సోనియా గాంధీ ఎడమ భుజానికి గాయం కావడంతో ముంబైకి చెందిన ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ దేశాయ్ ఆమెకు సర్జరీ చేయడం కోసం గురువారం ఢిల్లీకి వచ్చారు.
అనంతరం సోనియా గాంధీకి ఆపరేషన్ చేశారని, ఆమె ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడడంతో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకి తరలించామని ఆసుపత్రి బోర్డు ఛైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఓ వారం రోజుల పాటు ఆమెను ఆసుపత్రిలోనే ఉంచనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన తర్వాత ఆమె కొన్ని రోజులు ఫిజియో థెరపీ చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె తీవ్ర జ్వరం కారణంగా రోడ్ షోను మధ్యలోనే రద్దు చేసుకుని ఆర్మీ ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే.
డీహైడ్రేషన్, జ్వరం, అధిక రక్తపోటు, తలతిరగడం లాంటి సమస్యల బాధపడుతున్న ఆమెకు తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స చేయించగా, అక్కడి నుంచి ఎస్ఆర్జీహెచ్కి తరలించారు. రోడ్ షోలో భాగంగా సోనియా భుజానికి గాయమైందని, దీంతో ఆమెకు ఆపరేషన్ చేశామని గంగారాం ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.