శివాలయాన్ని దర్శించిన సోనియా: కాంగ్రెస్కే పిఏసి!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఉత్తరాఖండ్లోని ఓ శివాలయాన్ని సందర్శించారు. బగేశ్వర్ జిల్లా కౌసనిలో ఉన్న శతాబ్దం క్రితం నాటి రుద్రధరి శివాలయాన్ని ఆమె 1.5 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి సందర్శించుకున్నారు.
ఆదివారం ఇక్కడికి చేరుకున్న సోనియా తమ కుటుంబ మిత్రుడి ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో సోనియా ముచ్చటించారు. సోనియా గాంధీ తరచూ వేసవి సమయంలో ఈ ప్రాంతంలో వ్యక్తిగతంగా పర్యటిస్తుంటారు.
కాంగ్రెస్కే పిఏసి!
లోక్సభలో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందో తెలియదుగానీ, ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని సూచాయగా వెల్లడించారు. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదాపైనా కాంగ్రెస్కు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. లోక్పాల్ సహా అనేక కీలకమైన వాటిలో నియామకాలకు సంబంధించి ఆ పార్టీ అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
‘ప్రజా పద్దుల కమిటీ నియామకానికి సంబంధించి కాంగ్రెస్ను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నాం' అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పదవి కాంగ్రెస్కు ఇస్తారా? అన్న ప్రశ్నకు ‘దీనిపై చర్చలు సాగుతున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో దానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది' ఆయన అన్నారు.
కాగా, రాజ్యసభ ప్రతిపక్ష నేత అలాగే లోక్పాల్సహా పలు కమిటీలకు సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి మంత్రి నిరాకరించారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్నిక వ్యవహారంలో చట్ట ప్రకారం నడుచుకుంటారని వెంకయ్య తెలిపారు. ‘ఏ నిర్ణయం అయినా స్పీకర్ తీసుకుంటారు. ఈ విషయంలో స్పీకర్కే స్వరాధికారం ఉంది' అని వెంకయ్య చెప్పారు.