రంగంలోకి సోనియా: రవి భార్యకు లేఖ, సిబిఐకి కేసు అప్పగింత
న్యూఢిల్లీ: ఐఎఎస్ అధికారి రవి మృతి కేసు కర్ణాటక ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రంగంలోకి దిగారు. రవి సతీమణి కుసమకు ఆమె లేఖ రాశారు. నిజాయితీగా దర్యాప్తు జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు.
36 ఏళ్ల ఐఎఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతిపై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని ఇప్పటికే సోనియా గాంధీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించినట్లు సమాచారం. రవి మృతి కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం లాంఛనంగా సోమవారం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
శాసన సభ సమావేశాలు జరగకముందే మంత్రి వర్గ సమావేశం జరిగింది. సోమవారం ఉదయం విదాన సౌధలో సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. డికే. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే విషయంలో చర్చించారు. మంత్రి వర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకున్న తరువాత శాసన సభ సమావేశాలలో వివరాలు వెళ్లడించాలని సిద్దరామయ్య నిర్ణయించారు.
కాంగ్రెస్ ఎంఎల్ఏలకు విప్ జారి........ !
సోమవారం శాసన సభ సమావేశాలకు అందరూ హాజరు కావాలని కాంగ్రెస్ శాసన సభ్యులకు విప్ జారి చేశారు. డికే. రవి కేసు విషయంలో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, వారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులు బావించారు. సోమవారం ఉదయం సీఎం సిద్దరామయ్య అధికార నివాసం చేరుకున్న హొం శాఖ మంత్రి జార్జ్ సుమారు అర్దగంట సేపు చర్చించారు.
బీజేపీ, జేడీఎస్ నాయకుల సమావేశం..........!
శాసన సభలో ప్రతిపక్ష నాయకుడైన జగదీష్ శెట్టర్ నివాసంలో సోమవారం ఉదయం బీజేపీ శాసన సభ్యులు సమావేశం అయ్యారు. డి.కే. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే వరకు తాము పోరాటం చెయ్యాలని వారు నిర్ణయించారు. అదే విదంగా మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ పార్టి ఫ్లోర్ లీడర్ హెచ్.డి. కుమారస్వామి ఆద్వర్యంలో ఆ పార్టీ శాసన సభ్యులు సమావేశం అయ్యారు.
డికే. రవి కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించేంత వరకు బీజేపీతో కలిసి పోరాటం చెయ్యాలని కుమారస్వామి, ఆ పార్టీ శాసన సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
గత మంగళవారంనాడు రవి మృతి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బిజెపి, జెడి(ఎస్)లు ఆందోళన చేస్తున్నాయి. కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తే ఆ పార్టీలు ఆందోళనలను విరమించుకునే అవకాశం ఉంది.
సిఐడి మధ్యంత నివేదిక తమకు వస్తుందని, కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తామని సిద్ధరామయ్య ఇంతకు ముందు రవి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నివేదిక వివరాలను వెల్లడించకుండా రాష్ట్ర ప్రభుత్వం సిఐడి మధ్యంతర నివేదికను స్పీకర్ కొగడు తిమ్మప్పకు అందించే అవకాశం ఉంది. తద్వారా శాసనసభ చెలరేగుతున్న ఆందోళనకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఉంది.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధి ఐఏఎస్ అధికారి డి.కే. రవి భార్య కుసుమాను పరామర్శించారు. సోమవారం ఉదయం సోనియా గాంధి స్వయంగా కుసుమాకు ఫోన్ చేశారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని మనవి చేశారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని అన్నారు.
కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించకుంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని డి.కే. రవి మామ, కాంగ్రెస్ నాయకుడు హనుమంతరాయప్ప సోంత పార్టి నాయకులను హెచ్చరించారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించడానికి సిద్దరామయ్య అంగీకరిస్తారని నమ్ముతున్నానని హనుమంతరాయప్ప చెప్పారు.