మోడీపై ప్రశంసలు: ద్వివేదిపై సోనియా సీరియస్, చర్యలుంటాయన్న మాకెన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుల్లో ఒకరైన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జనార్దన్ ద్వివేదీపై పార్టీ సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించటంతోపాటు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు భారతీయతకు ఓటు వేశారంటూ ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఏఐసిసి మీడియా విభాగం అధ్యక్షుడు అజయ్ మాకెన్ గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి హిందీ భాషను నేర్పించటంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇంఛార్జ్గానూ ద్వివేది వ్యవహరించారు. ఆయన బుధవారం రిడీఫ్ డాట్కామ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గత లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు భారతీయతకు ఓటు వేసినందువల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకే నరేంద్ర మోడీ విజయం సాధించారు' అని వ్యాఖ్యానించారు.
దేశ ప్రజలు భారతీయతకు ఓటు వేశారనటం కాంగ్రెస్ విధానానికి వ్యతిరేకమని అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. భారతదేశం భిన్నజాతులు, మతాల సంగమమని ఆయన చెప్పారు. జనార్దన్ ద్వివేదీ లాంటి సీనియర్ నాయకుడు ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ, బిజెపి విజయం సాధించలేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటూ ద్వివేదీ చేసిన వ్యాఖ్యలను మాకెన్ ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడిపోయిందంటూ ద్వివేదీ చేసిన మరో వ్యాఖ్యను కూడా ఆయన ఖండించారు. ‘దేశ ప్రజలకు తాము అత్యంత సన్నిహితంగా ఉన్నామని చెప్పటంలో బిజెపి, నరేంద్ర మోడీ విజయం సాధించారు. అందుకే ఇది భారతీయత విజయం' అని జనార్దన్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయాన్ని భారతీయత విజయంగా ఆయన చూపడం తమకెంతమాత్రం సమ్మతం కాదని మాకెన్ అన్నారు. నరేంద్ర మోడీ విజయం వేరు, భారతీయత వేరని చెప్పారు.
జనార్దన్ ద్వివేదీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే జనార్దన్ ద్వివేదీ గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేశారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని ఓ సందర్భంలో వెల్లడించి వివాదం సృష్టించారు. ద్వివేది తీరుపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు.
అయితే ఆయన మాత్రం తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపించటం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర మనస్తాపానాకి గురయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీనియర్ నాయకుడై ఉండి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించినట్లు ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్కు భారతీయత లేదనే విధంగా మాట్లాడిన జనార్దన్ ద్వివేదీని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఒక్కటే మార్గమని సోనియాగాంధీ అభిప్రాయపడినట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా తాను బిజెపిలో చేరనున్నట్లు వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని జనార్దన్ ద్వివేదీ ప్రకటించారు. తాను కాంగ్రెస్వాదిగానే ఉంటానని, కాంగ్రెస్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వడం లేదు. కాగా, ద్వివేది, శశిథరూర్ లాంటి సీనియర్ల తోపాటు మరికొందరు పార్టీ నేతలు మోడీపై ప్రశంసలు కురిపిస్తుండటంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది.