నితీష్ ప్రమాణం: బిజెపి వ్యతిరేక శక్తులు ఏకతాటిపైకి
పాట్నా: ఈ నెల 20వ తేదీన బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకులు హాజరవుతున్నారు! బీహార్ ఎన్నికల్లో మహాకూటమి (కాంగ్రెస్-జెడీయు-ఆర్జేడీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బిజెపి వ్యతిరేక శక్తులన్నీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక్కతాటి పైకి రానున్నాయి. ఈ విషయాన్నే జేడీయూ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అందరి నాయకులను తాము ప్రమాణ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామన్నారు.
ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్లు కార్యక్రమం ముఖ్య అతిధులని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ నాయకులంతా తమ ఐక్యతను ఒకే వేదికపై నుంచి చాటనున్నారని జేడీయూ జనరల్ సెక్రటరీ కెసి త్యాగీ చెప్పారు.
ఇది దేశంలో సరికొత్త అధ్యాయానికి నాంది అన్నారు. ప్రమాణ కార్యక్రమానికి విచ్చేసే అతిథులలో... ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు రానున్నారు.
అస్సాం సీఎం తరుణ్ గోగాయ్, మాజీ ప్రధాని దేవేగౌడ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీ, ఇండియన్ నేషనల్ లోక్దల్ నాయకుడు అభయ్ చౌతాలాతో పాటు పలువురికి ఆహ్వానాలు అందాయి.