సోనియానా లేక రాహుల్ గాంధీనా: ఢిల్లీలో పార్లమెంటరీ నేతను ఎన్నుకోనున్న కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న కాంగ్రెస్...శనివారం న్యూఢిల్లీలో భేటీ కానుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎంపీలంతా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో తమ పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకోనున్నారు. అయితే సోనియాగాంధీనే ఎన్నుకుంటారా లేక మరెవరినైనా ఎన్నుకుంటారా అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగలేనని తేల్చి చెప్పారు. అయితే ఇందుకు హైకమాండ్ ఒప్పుకోలేదు. రాహుల్ కొనసాగాల్సిందిగా పట్టుబట్టింది.
మోడీ కేబినెట్లో ఇంతమందిపై క్రిమినల్ కేసులు..అత్యంత ధనవంతులైన మంత్రి ఎవరంటే..?
ఇదిలా ఉంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీనేతగా ఎన్నికవుతారని తెలుస్తోంది. 17వ లోక్సభ తర్వాత రాజ్యసభకు కూడా కొత్త పార్లమెంటరీ నేతను ఎన్నుకుంటారని సమాచారం. ఇక రాహుల్ గాంధీ పాల్గొనే తొలి అధికారిక సమావేశంకూడా ఇదే కానుండటం విశేషం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖను సమర్పించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ రాజీనామా చేస్తా అని చెప్పడం, కాంగ్రెస్లో అంతర్గత విబేధాలు రావడంతో ఈ సమావేశంలో ముగ్గురు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇందులో ఉత్తర భారతం ,తూర్పు భారతం, దక్షిణ భారతం నుంచి నాయకులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే నాలుగో వర్కింగ్ ప్రెసిడెంట్ను పశ్చిమ భారతం నుంచి ఎన్నుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ యువనాయకులను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. జ్యోతిరాదిత్య సిందియా ఇందులో ఒకరు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలుండగా... కేసీ వేణుగోపాల్, మిలింద్ దియోరా పేర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు వినిపిస్తున్నాయి.
శనివారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత హస్తం పార్టీలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమయంలోనే ఎంపీలంతా రానున్న పార్లమెంటు సమావేశాలకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే అంశంపై కూడా చర్చించనున్నారు.