కుమారుడు, కుమార్తెతో కలిసి హోమం చేసిన సోనియాగాంధీ: ఇదే తొలిసారి!
Recommended Video
రాయ్ బరేలీ: అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ హోమాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఆమె తన కుమారుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలతో కలిసి హోమం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యలో హోమం నిరాటంకంగా కొనసాగింది. సోనియాగాంధీ హోమాన్ని నిర్వహించడంలో ఓ విశేషం ఉంది. ఇప్పటిదాకా ఆమె ఎప్పుడూ హోమం చేయలేదు. యజ్ఞ యాగాదులకు హాజరు కాలేదు. తొలిసారిగా ఆమె హోమాన్ని నిర్వహించారు.
రాయ్ బరేలీ.. సోనియాగాంధీకి కంచుకోట. ఇదే నియోజకవర్గం నుంచి ఆమె వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2004, 2006 (ఉప ఎన్నిక), 2009, 2014 ఎన్నికల్లో సోనియాగాంధీ ఈ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ ఆమె ఇదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి.. త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందుగా ఆమె యజ్ఞ యాగాదులను నిర్వహించడం చర్చనీయాంశమైంది.
ఈ ఉదయం ఆమె తన కుమారుడు, కుమార్తెను వెంట బెట్టుకుని రాయ్ బరేలీలో స్థానిక ఆలయంలో హోమాన్ని, పూజలను నిర్వహించారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, పలువురు కేంద్ర మాజీమంత్రులు దీనికి హాజరయ్యారు. హోమం పూర్తయిన వెంటనే సోనియాగాంధీ.. రాయ్ బరేలీలో రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు.