కాంగ్రెస్ కన్ఫ్యూజన్: సోనియా చేతికి మళ్లీ పగ్గాలు..!! చీలిక నివారణకేనా?
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సారథ్య పగ్గాలు మరోసారి సోనియాగాంధీ చేతికే చిక్కాయి. ఏఐసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఇది తాత్కాలికమేనని సీడబ్ల్యూసీ స్పష్టం చేయడం కొస మెరుపు. ఏఐసీసీ అధ్యక్ష స్థానం సహా పార్టీపరంగా కొన్ని కీలక పదవులకు అంతర్గతంగా ఎన్నికలను నిర్వహించాల్సి ఉందని వెల్లడించింది. ఈ ఎన్నికల వరకు సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతారని తేల్చేసింది. సుమారు ఏడాదిన్నర తరువాత సోనియా గాంధీ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అంతకుముందు- మహారాష్ట్రకు చెందిన పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తరువాత అవన్నీ నిజం కావని తేలిపోయాయి. చివరికి- సోనియా గాంధీకే పార్టీ పగ్గాలు దక్కాయి.
రాహుల్ ససేమిరా
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయాన్ని చవి చూసిన అనంతరం రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడిన మూడు వారాల్లోనే రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. దానికే కట్టుబడి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన రాజీనామా పత్రాన్ని ఉపసంహరించుకునేది లేదని భీష్మించారు. సుమారు మూడు నెలల పాటు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాళీగానే కొనసాగింది. తాత్కాలికంగా ఎవ్వరినీ నియమించుకోలేదు. పార్టీకి చెందిన పలువురు సీనియర్లు, కీలక నేతలు రాహుల్ గాంధీకి నచ్చజెప్పినప్పటికీ.. ఆయన మెట్టు దిగలేదు. ఫలితంగా- కొత్త అధ్యక్షుడి కోసం సీడబ్ల్యూసీ తాజాగా సమావేశమైంది. సోనియా గాంధీ చేతికే పార్టీ సారథ్య బాధ్యతలను అప్పగించింది.
చీలిక నివారణకేనా?
గాంధీయేతర కుటుంబాలకు చెందిన నేతకు అధ్యక్షుడిగా నియమించడం వల్ల కాంగ్రెస్ పార్టీలో చీలక ఏర్పడగలదనే సంకేతాలు అందాయని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త నాయకుడికి అవకాశం ఇవ్వలేదనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. మొదట్లో మహారాష్ట్రకు చెందిన ముకుల్ వాస్నిక్, కర్ణాటకకు చెందిన దళిత నేత మల్లికార్జున ఖర్గే వంటి నాయకుల పేర్లు బలంగా వినిపించాయి. ఈ ఇద్దరిలో ఎవరూ ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నిమితులవుతారంటూ చెబుతూ వచ్చారు. ముకుల్ వాస్నిక్ పేరు దాదాపు ఖారారైనట్లు కూడా హస్తినలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఆయన ఎంపిక లాంఛనప్రాయమే అనుకుంటున్న దశలో కథ మళ్లీ మొదటికొచ్చింది.
పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోన్నకుమారి సెల్జా వ్యాఖ్యలు
సోనియాగాంధీ పేరును పలువురు సీనియర్లు ప్రతిపాదించారు. ఆమెకే పార్టీ సారథ్య బాధ్యతలను అప్పగించారు. ఇది తాత్కాలికమేనని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం త్వరలోనే ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. వాటి ఫలితాల ఆధారంగా అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఎప్పుడు ఈ ఎన్నికలను చేపడతారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. పార్టీలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో సోనియా గాంధీని నియమించడం ఒక్కటే సరైన నిర్ణయం అని కుమారి సెల్జా వ్యాఖ్యానించడం.. పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తురాలైన నాయకురాలిగా కుమారి సెల్జాకు పేరుంది.
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోగా..
ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లల్లో మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ అధికారంలో కొనసాగుతోంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు ఎలా చేర్చుతారనేది ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చిన అంశం. ఈ సవాల్ ను అనుభవం ఉన్న సోనియాగాంధీ ఎలా ఎదుర్కొంటారనే చర్చ ఆరంభమైంది. అయిదు కాదు, పది కాదు.. ఏకంగా 19 సంవత్సరాల పాటు సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. 2017లో అనారోగ్య కారణాల వల్ల ఆమె తప్పుకొన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాగలగింది సోనియాగాంధీ సారథ్యంలోనే. పదేళ్ల పాటు పార్టీని కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టగలిగారు. అత్యంత శక్తిమంతులైన రాజకీయనేతగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
కుంగదీసిన అనారోగ్యం..వరుస ఓటములు..
అనారోగ్యం ఆమెను కుంగదీసింది. 2017న పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్న తరువాత పెద్దగా క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ ఉమ్మడి ప్రచారం చేసినప్పటికీ.. మొన్నటి ఎన్నికల్లో ఆశించిన ఫలితాలేమీ రాలేదు. వరుస ఓటముల అనంతరం పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నేతకు పార్టీ పగ్గాలను అప్పగిస్తే.. చీలక ఖాయమనే ఆందోళన వ్యక్తమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మరోసారి సోనియాగాంధీ చేతికే సారథ్య బాధ్యతలను అప్పగించడం వైపే సీడబ్ల్యూసీ మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా సోనియాగాంధీ పునర్నియామకం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను పార్టీ అధినేత్రిగా మరోసారి చూడాల్సి వచ్చినందుకు ఆనందంగా ఉందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీడబ్ల్యూసీ అత్యుత్తమ నిర్ణయాన్ని తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.