సోనుసూద్పై ఉద్దవ్ ప్రశంసలు, సంజయ్ అలా, మహా సీఎం ఇలా.. గంటల్లో మారిన రాజకీయం...
మహారాష్ట్రలో సినీ నటుడు సోను సూద్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. వలసకూలీలను స్వస్ధలాలకు పంపించేందుకు బస్సులను సోనుసూద్ ఏర్పాటు చేశారు. వారి అన్నపానీయాలు అందజేస్తూ.. గత 20 ఏళ్లలో తాను కూడబెట్టిన ఆస్తులను హారతి కర్పూరంలా వెచ్చిస్తున్నారు. మంచి చేస్తున్న నటుడిని అభినందించాల్సింది పోయి.. శివసేన నేత సంజయ్ రౌత్ నోరు పారేసుకున్నారు. మహాత్మా అంటూ సెటైర్లు వేశారు. అయితే ఆయన కామెంట్ చేసిన మరుసటి రోజే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మంత్రి ఆదిత్య థాకరేతో సోను సూద్ సమావేశమయ్యారు.
ఆదివారం రాత్రి ముంబైలోని ఉద్దవ్ నివాసం మాతో శ్రీలో సోను సూద్ ఉద్దవ్, ఆదిత్యతో సమావేశమై.. వలసకూలీల సాయంపై చర్చించారు. తర్వాత సోను సూద్ చేసిన సాయాన్ని సీఎం ఉద్దవ్ థాకరే ప్రసంశించారు. ముంబైలో ఉన్న ఉత్తరాదికి చెందిన వలసకూలీలను తరలించడంలో తీసుకున్న చొరవ ప్రశంసనీయం అని కొనియాడారు. అయితే అంతకుముందు శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించగా.. ఒక్క రోజులోనే ఉద్దవ్ ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Recommended Video
బీజేపీ రాసిచ్చిన స్కిప్ట్ మేరకు సోను సూద్ పనిచేస్తున్నారని సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. వలసకూలీలను ఆదుకొని మహాత్మగా మారాడని వ్యంగ్యాస్త్రాలు సందించారు. సడెన్గా గాంధీజీ పుట్టుకొచ్చారు అని విమర్శలు చేశారు. అంతేకాదు గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో సోను సూద్ బీజేపీకి అనుకూలంగా పనిచేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే వెంటనే సోను సూద్.. ఉద్దవ్తో భేటీ కావడం.. ఆయన వెంటనే సోను సూద్ను ఆకాశానికి ఎత్తేయడం చకచకా జరిగిపోయింది.