ఉద్యోగం ఊడింది, బ్యాంక్ దోపిడీ... క్షమాపణ పత్రం రాసిన ఓ దొంగ
నోయిడా: ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో ఓ దొంగ రాసిన క్షమాపణ పత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కెనరా బ్యాంకులో ఆదివారం రాత్రి దొపిడీకి యత్నించి విఫలమమైన తర్వాత క్షమాపణ పత్రం రాశాడు దొంగ. దోపిడీకి వచ్చినందుకు తనన్ని క్షమించాలని కోరతూ, అసలు తానెందుకు దొంగతనానికి వచ్చాడో ఆ లెటర్లో వివరించాడు.
"మీ కుర్చీలో కూర్చుని మీకే రాస్తున్నాను. ఇటీవలే నా ప్రైవేటు ఉద్యోగం పోయింది. ధరలు పెరిగిపోయాయి. నాకు ముగ్గురు పిల్లలున్నారు. నా ఫ్యామిలీ కోసమే దొంగతనం చేస్తున్నాను. జీవితంలో తొలిసారి బ్యాంకు దొంగతనం చేస్తున్నాను, నేను ఫెయిల్ అయ్యాను" అని హిందీలో రాశాడు.
సోమవారం ఉదయం సిబ్బంది వచ్చి చూసేసరికి బ్యాంకు తలుపులకు ఉన్న తాళాలు తెరుచుకుని ఉన్నాయి. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. జాగిలాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాల కోసం వెతుకుతుండగా లేఖ కంటబడింది.
నగదు, ఆభరణాలన్నీ స్ట్రాంగ్ రూంలో ఉండడంతో అతడు ఉత్త చేతులతో వెనుదిరగక తప్పలేదు. దీంతో పోలీసులు దొంగ బ్యాంకు తలుపులు తెరిచేందుకు ఉపయోగించిన ఆయుధాలతో సహా అన్నింటిని క్లుప్తంగా పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.