పోలీసులకు షాక్ : హెల్మెట్ ఎందుకు ధరించలేదని అడిగితే ఇతగాడి సమాధానం ఏమిటో తెలుసా..?
బెంగళూరులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చిక్బళ్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇలా తనిఖీ చేస్తున్నవారికి ఓ వ్యక్తి హెల్మెట్ ధరించకుండా బైకును నడుపుతున్న వ్యక్తి తారసపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తిని ఆపారు. తన పేరు సందీప్ అని చెప్పాడు ఆ వ్యక్తి. హెల్మెట్ ధరించకుండా ఎలా వెళతావు అని పోలీసులు ప్రశ్నించారు. బైకుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సిందిగా కోరారు. అయితే బండికి సంబంధించిన పత్రాలు ఏవీ తనదగ్గర లేవని చెప్పిన సందీప్ ఆ తర్వాత తను ఇచ్చిన వివరణ విని పోలీసులు షాక్ అయ్యారు.
ఇప్పుడే తన స్నేహితుడిని కత్తితో పొడిచి వస్తున్నట్లు చెప్పిన సందీప్... పోలీసులకు లొంగిపోయేందుకే తాను వెళుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు హెల్మెట్ ధరించనందుకు తనను క్షమించాల్సిందిగా పోలీసులను వినయంగా వేడుకున్నాడు. సందీప్ చెప్పిన సమాధానంతో షాక్కు గురైన పోలీసులు కాసేపటికి తేరుకుని పూర్తి వివరాలు చెప్పాల్సిందిగా గట్టిగా అడిగారు. దేవరాజ్ అనే వ్యక్తి తనకు మంచి స్నేహితుడని సందీప్ చెప్పాడు. ఇద్దరూ వ్యాపారంలో భాగస్వాములని చెప్పాడు. ఫ్రెండ్షిప్లో భాగంగా 2016లో దేవరాజ్ తన దగ్గర నుంచి లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడని ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పాడు.
ఏదో భూమి కొనేందుకు ఆ డబ్బులు అడిగాడని భూమికి మంచి ధర పలకగానే డబ్బులు ఇస్తానని తనతో చెప్పినట్లు సందీప్ వివరించాడు. అయితే రెండేళ్లు గడిచినప్పటికీ తాను డబ్బులు తిరిగి ఇవ్వలేదని పదే పదే తన చుట్టూ తిప్పుకుంటున్నాడని చెప్పాడు. అంతేకాదు అసలు భూమి కొనుగోలు చేయలేదని సందీప్ పోలీసులకు వివరించాడు. డబ్బుల విషయంలో గతేడాదిగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందని చెప్పాడు. ఈ క్రమంలోనే మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహంతో తాను దేవరాజ్ను కత్తితో పొడిచినట్లు సందీప్ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం దేవరాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.