సారీ సార్... దేశ ద్రోహి అనుకున్నా సరే.. మోదీకి కమల్ హాసన్ ఘాటు లేఖ
సినీ నటుడు,మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ప్రధాని మోదీకి ఘాటైన లేఖ రాశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో చేసిన తప్పులనే మళ్లీ రిపీట్ చేస్తున్నారని గుర్తుచేశారు. అప్పుడు,ఇప్పుడు మీరు తీసుకున్న హఠాత్ నిర్ణయాలు పేదలనే బలితీసుకుంటున్నాయని చెప్పారు. వైరస్ సంక్రమణ గురించి 4 నెలల ముందు నుంచే సమాచారం ఉన్నా.. కేవలం 4గంటల వ్యవధిలో లాక్ డౌన్ ప్రకటించి పేదల జీవితాలను మరింత అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. చప్పట్లు కొట్టడం,దీపాలు వెలిగించడం లాంటి ప్రకటనలు భద్ర జీవితం గడుపుతున్న మధ్య తరగతి,ఉన్నత వర్గాలను దృష్టిలో పెట్టుకున్నవే తప్ప.. పేద వర్గాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. వైరస్ నియంత్రణ చర్యలను చేపడుతూనే పేదలను ఆదుకోవడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన బహిరంగ లేఖలో అనేక విషయాలను ప్రస్తావిస్తూ కమల్ హాసన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కేవలం బాల్కనీ ప్రజల కోసమే పనిచేయకండి..
ఒక పేదోడి వార్త ఎప్పుడూ ఫ్రంట్ పేజీ న్యూస్లో చోటు దక్కించుకోదని.. కానీ దేశ నిర్మాణంలో అతని పాత్ర విస్మరించలేనిదని కమల్ గుర్తుచేశారు. ఈ దేశంలో మెజారిటీ వాటా పేదోడిదే అని.. జీడీపీలో అతని వాటా విస్మరించలేనిదని చెప్పారు. కాబట్టి దేశ పునాదుల్లాంటి పేదల నాశనానికి దారితీసే చర్యలు.. దానిపై నిర్మితమైన దేశాన్ని కూడా కూల్చేస్తాయని హెచ్చరించారు. చప్పట్లు కొట్టడం,దీపాలు వెలిగించడం లాంటి సైకో థెరపీ చర్యలు బాల్కనీ ఉన్నవాళ్ల కోసం బాగానే ఉంటాయని.. కానీ పేదల సంగతేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం బాల్కనీ ఉన్నవాళ్ల కోసం.. బాల్కనీ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ఉండకూడదని భావిస్తున్నానన్నారు.
ఓవైపు దీపాలు.. మరోవైపు పేదోడి ఇంట్లో..
పెద్ద నోట్ల రద్దు సమయంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతోందని కమల్ ఆరోపించారు. నోట్ల రద్దు కారణంగా చాలామంది తాము దాచుకున్న డబ్బులతో పాటు జీవనోపాధి కూడా కోల్పోయారని.. ఇప్పుడు ప్రణాళిక లేని లాక్ డౌన్ కారణంగా మరోసారి అదే జరుగుతోందని అన్నారు. చాలామంది పేదలు తమ జీవనోపాధినే కాదు ప్రాణాలే కోల్పోయే పరిస్థితి తలెత్తిందన్నారు. పేదలకు మీవైపు చూడటం తప్ప ఇంకో మార్గం లేదని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ఓవైపు మీరు భద్ర జీవితం గడుపుతున్నవారిని దీపాలు వెలిగించమని చెబుతున్నారు.. కానీ మరోవైపు పేదోడు రేపు రొట్టెలు కాల్చేందుకు తనవద్ద సరిపడేంత నూనె ఉందా లేదా అని చూసుకుంటున్నాడని గుర్తుచేశారు. మీ చివరి రెండు ప్రసంగాల్లో ప్రస్తావించని ఎన్నో అంశాలు,సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని మోదీకి గుర్తుచేశారు.
అదే పునరావృతమవుతోంది..
లాక్ డౌన్కు ముందే మార్చి 23న తాను ప్రధానికి రాసిన లేఖలో.. ఇలాంటి తరుణంలో పేదల గురించి కాస్త దృష్టిలో పెట్టుకోవాలని కోరినట్టు కమల్ హాసన్ గుర్తుచేశారు. కానీ ఆ మరుసటి రోజే.. గతంలో నోట్ల రద్దును ప్రకటించినట్టే లాక్ డౌన్ను ప్రకటించారు. నోట్ల రద్దు సమయంలోనూ తాను ప్రధాని నిర్ణయం పట్ల నమ్మకంతో ఉన్నానని.. కానీ ఆ తర్వాత అది తప్పని రుజువైందని అన్నారు. మీ నిర్ణయం తప్పని కాలమే రుజువు చేసిందని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ విషయంలోనూ అదే తప్పు మళ్లీ పునరావృతమవుతోందన్నారు. తాను మధ్య తరగతి లేదా ఏ ఇతర వర్గాలను విస్మరించమని చెప్పట్లేదని.. ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోవద్దనే చెబుతున్నానని అన్నారు.
Recommended Video
దేశ ద్రోహి అనుకున్నా సరే..
కరోనా వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతూనే ఉందని.. మరోవైపు పేదల్లో ఆకలి,అలసట,లేమి వంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పారు. కోవిడ్ 19 కంటే ఇవి ప్రాణాంతకమైనవని.. వైరస్ అంతం తర్వాత కూడా ఆ ప్రభావం చాలా కాలం కొనసాగుతుందని చెప్పారు. ఈ మాట చెప్పడానికి తాను చింతిస్తున్నా.. చెప్పక తప్పడం లేదని.. ఈసారి మీ(మోదీ) విజన్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నందుకు ఈసారి తననెవైరా దేశ ద్రోహి అనుకున్నా ఫర్వాలేదన్నారు. సరైన ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయాలకు సామాన్యులను నిందించడం తగదన్నారు. ప్రజలకు సాధారణ జీవితం,భద్రత అందించడానికే వారు ప్రభుత్వాలను ఎన్నుకున్నారని గుర్తుచేశారు. తమలో ఆగ్రహం ఇంకా ఉందని.. అయితే ఇప్పటికీ తాము మీవైపే(మోదీ) ఉన్నామని ముగించారు.