సౌమ్యపై రేప్, హత్య: ఉరిశిక్ష తప్పించుకున్న దోషి
న్యూఢిల్లీ: కేరళ యువతి సౌమ్యపై అత్యాచారం, ఆమెహత్య కేసులో దోషికి మరణదండనను సుప్రీంకోర్టు రద్దు చేసింది. శిక్షను ఏడేళ్లకు ఖరారు చేస్తూ గురువారం జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ పీసీ పంత్, జస్టిస్ యూయూ లలిత్తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
కొచిలోని షాపింగ్మాల్లో సౌమ్య ఉద్యోగిని. రోజూమాదిరిగానే ఫిబ్రవరి 1, 2011లో ఎర్నాకుళం-షోరనూర్ పాసింజర్ రైలులో మహిళల బోగీలో ప్రయాణిస్తోంది. అదే రైలులో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన గోవిందచామి ఒక్కసారిగా మహిళల బోగీలోకి వచ్చి సౌమ్యను రైలునుంచి తోసేశాడు. ఆ తర్వాత అతడు కూడా రైలులోంచి దూకాడు.
గాయపడిన సౌమ్యను భుజాన వేసుకుని ట్రాక్ పక్కనున్న చెట్లవద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె త్రిస్సూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్సపొందుతూ ఫిబ్రవరి 6వ తేదీన మరణించింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసింది.
నేరం రుజువు కావడంతో గోవిందచామిని దోషిగా నిర్ధారిస్తూ 2012లో కోర్టు ఉరిశిక్ష విధించింది. కేరళ హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఈ కేసు సుప్రీంకోర్టు చేరడంతో విచారణ జరిపిన ధర్మాసనం శిక్షను తగ్గిస్తూ తీర్పునిచ్చింది. గోవిందచామిపై తమిళనాడులోనూ 8 కేసులు ఉండటం గమనార్హం. సుప్రీంతీర్పుపై సౌమ్య కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాదులు నిందితుడితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.