ప్రచారాలకు చెక్: బెంగాల్ గవర్నర్తో భేటీపై స్పందించిన సౌరవ్ గంగూలీ
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. బీజేపీలో చేరతారంటూ ప్రచారం కూడా జరిగింది.
సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఇప్పటికే జరగడంతో ఈ భేటీ అందుకు మరింత బలాన్నిచ్చిందంటూ పలువురు రాజకీయ నేతలు పేర్కొన్నారు. తన భేటీపై రాజకీయ చర్చ జరుగుతుండటంతో స్వయంగా గంగూలీనే రంగంలోకి దిగి ఇందుకు పుల్ స్టాప్ పెట్టారు.
తమది కేవలం మర్యాద పూర్వక సమావేశమేనని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే, గవర్నర్ ఈడెన్ గార్డెన్స్ను సందర్శించాలని అనుకున్నారని, కానీ, అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్నందున అది సాధ్యం కాదని చెప్పినట్లు గంగూలీ తెలిపారు. వచ్చే వారం స్టేడియాన్ని సందర్శించాలని కోరగా.. ఆయన అంగీకరించారని చెప్పారు.
ఆదివారం రాజ్భవన్కు వెళ్లిన గంగూలీ సుమారు గంటా 20 నిమిషాలపాటు గవర్నర్ జగదీప్ ధన్ కర్తో సమావేశమయ్యారు. ఈ భేటీపై గవర్నర్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. పలు సమస్యలపై గంగూలీతో చర్చించినట్లు గవర్నర్ తెలిపారు. పురాతన ఈడెన్ గార్డెన్స్ను సందర్శించాలని గంగూలీ కోరారని, అందుకు అంగీకరించినట్లు గవర్నర్ వెల్లడించారు.
Recommended Video
ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి.. గవర్నర్ ధన్కర్కు చాలా అంశాల్లో విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిపై పలుమార్లు గవర్నర్ ప్రత్యక్షంగానే విమర్శలు చేశారు. మమతా బెనర్జీ కూడా అదే స్థాయిలో స్పందించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.