భారత్ నేపాల్ల మధ్య ఇంధనం పైప్లైన్: సంయుక్తంగా ప్రారంభించిన మోడీ, ఓలీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీలు ఇరు దేశాల మధ్య నిర్మించిన తొలి ఇంధనం పైప్లైన్ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ పైప్లైన్ను మోతిహరీ నుంచి ఆమ్లెక్గంజ్వరకు నిర్మించారు. దక్షిణాసియాలోనే 60 కిలోమీటర్లకు పైగా పెట్రోలియం ప్రాడక్ట్ పైప్లైన్ రెండు దేశసరిహద్దుల మీదుగా నిర్మించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం భారత్ నుంచి పెట్రోల్ను ట్యాంకర్ల ద్వారా నేపాల్కు రవాణా చేస్తున్నారు. 1973 నుంచి ఇదే తరహాను అవలంబిస్తున్నారు.
భారత్ నేపాల్ల మధ్య నూతనంగా నిర్మించిన ఈ పైప్లైన్ ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్-నేపాల్ మధ్య ఇంధన రంగ సహకారం రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను సూచిస్తుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. అంతేకాదు ఈ ప్రాజెక్టు ద్వారా రెండు దేశాల మధ్య ఇంధన భద్రత నెలకొనడమే కాకుండా రవాణా ఛార్జీలను కూడా తగ్గిస్తుందని వెల్లడించారు.
Boosting ties with Nepal! Inaugurating first ever cross-border petroleum products pipeline in South Asia https://t.co/9CGe36g3m1
— Narendra Modi (@narendramodi) September 10, 2019
ఇంధన పైప్లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా వీడియో లింక్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. 2015లో నేపాల్ను భూకంపం కబళించిన సమయంలో నేపాల్ ఎంతో కోల్పోయిందని అయితే తిరిగి త్వరగా కోలుకుందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఇక నేపాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భారత్ సహకారం తప్పకుండా ఉంటుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. నేపాల్ భారత్ సహకారం కోరితే కచ్చితంగా అందజేస్తామని మోడీ చెప్పారు. ఇక వీడియో లింక్ ద్వారా నేపాల్ ప్రధాని అక్కడి ప్రజాప్రతినిధులతో మాట్లాడటం చాలా ఆనందాన్ని కలగజేస్తోందని మోడీ చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య మంచి సంబంధాలు ఉండటం మన సంస్కృతికి, మన సత్సంబంధాలకు అద్దం పడుతుందని మోడీ చెప్పారు.