దక్షిణ భారత్ పై మోడీకి ఎన్నాళ్లీ అక్కసు, సవతి తల్లి ప్రేమ, ఎంగిలిమెతుకులు, సీఎం ఫైర్!
బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూసినట్లు చూస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. పరిపాలనలో రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించాల్సిన సమయం వస్తోందని సీఎం సిద్దరామయ్య అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఎదురు తిరిగితే కేంద్రం ఏకాకి అయ్యి రోడ్డున పడుతుందని, ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు పెట్టుకోవాలని సీఎం సిద్దరామయ్య హెచ్చరించారు. ఫేస్ బుక్ లో సీఎం సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శిస్తు వ్యాఖ్యలు చేశారు.
విదేశాలతో ఏకపక్షం
కేంద్ర ప్రభుత్వం విదేశాలతో ఏకపక్షంగా చేసుకుంటున్న ఒప్పందాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రస్థాయిలో నష్టపోతున్నాయని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను దెబ్బకొట్టడానికే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.
సమాఖ్య వ్యవస్థ
భారతదేశం వివిధ రాష్ట్రాల సమాహారంతో ఏర్పాటు అయిన సమాఖ్య వ్యవస్థ అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరిచిపోయిందని, రాష్ట్రాలకు ప్రజాహిత, పరిపాలన నిర్ణయాలు తీసుకోవడానికి మరింత స్వయంప్రతిపత్తి కల్పించాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు.
శ్రీలంకతో బజారుపాలు
కేంద్ర ప్రభుత్వం వియత్నాం మిరియాల్ని శ్రీలంక నుంచి దిగుమతి చేసుకునే ఒప్పందం కుదుర్చుకోవడంతో కేరళ, కర్ణాటకలోని మిరియాల రైతుల బజారుపాలు అయ్యారని, వస్తుసేవల పన్ను మాదరి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి ప్రత్యేక మండలిని ఏర్పాటు చెయ్యాలని సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు.
దక్షిణ భారత్ కు వెన్నుపోటు
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కేవలం ఎంగిలి మెతుకులు విదుల్చుతుందని, దక్షిణాది రాష్ట్రాలను ఏవిధంగా ప్రోత్సహించడం లేదని, మోడీ ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తొందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.
మా డబ్బులు యూపీకి !
కర్ణాటక పన్ను రూపంలో చెల్లిస్తున్న ప్రతి రుపాయికి కేంద్ర ప్రభుత్వం రూ. 47 పైసలు మాత్రమే తిరిగి చెల్లిస్తోందని, మిగిలిన రూ. 53 పైసలు ఉత్తర భారతదేశం కోసం ఖర్చు పెడుతోందని, అదే ఉత్తరప్రదేశ్ ఒక్క రూపాయి చెల్లిస్తే తిరిగి ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1.79 పైసలు చెల్లిస్తోందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ దెబ్బ
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు చేసిన సమయంలో మహారాష్ట్రలోని శివసేన, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా, పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇస్తోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు.
బెంగళూరు తెలుగు ప్రజలు టార్గెట్
బెంగళూరులో బీజేపీకి బలమైన మద్దతు ఉంది. బెంగళూరు నగరంలో తెలుగు ప్రజలు అధిక శాతంలో ఉన్నారు. బెంగళూరు తెలుగు ప్రజలను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో తెలుగు ప్రజలను ఆకర్షించడానికి సీఎం సిద్దరామయ్య ప్రయత్నాలు చేస్తున్నారు.