సౌత్ వర్సెస్ సెంటర్: సిద్ధూ కన్నా అడుగు ముందుకేసిన కేరళ
న్యూఢిల్లీ: నిధుల పంపిణీ సమస్యపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కన్నా కేరళ ఓ అడుగు ముందుకేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై గొంతెత్తాలని సిద్ధరామయ్య దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కేరళ ఆర్థిక థామస్ ఐజాక్ మరో అడుగు ముందుకేశారు.
దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి థామస్ ఐజాక్ ముందుకు వచ్చి, ఆ సమావేశానికి వారిని ఆహ్వానించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులంతా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
తాము పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో అందిస్తున్నప్పటికీ తమకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. థామస్ ఏర్పాటు చేసే సమావేశం తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఒకే వేదిక మీదికి తెస్తుందని భావిస్తున్నారు.
నిధుల కేటాయింపునకు 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఆర్థికంగానే కాకుండా లోకసభ, రాజ్యసభ సీట్ల విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కొత్త జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుంది.