కేంద్రం నిర్ణయంతో దక్షిణాదికి పూడ్చలేని నష్టం?: ఒక్కో రాష్ట్రానికి రూ.20వేల కోట్ల దెబ్బ
హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాలను కలవరపరుస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘానికి ఎన్డీయే ఇచ్చిన మార్గదర్శకాలు దక్షిణాది రాష్ట్రాలకు మరింత నష్టం చేసేవిగా ఉన్నాయి. ఇవి గనుక అమలులోకి వస్తే 2020-21 నుంచి 2024-25వ ఆర్థిక సంవత్సరం వరకు సుదీర్ఘ కాలం దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతాయి.
దక్షిణాదికి నష్టమే..
కేంద్రం వద్ద వసూలయ్యే పన్నుల ఆదాయాన్ని.. 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు పంపిణీ చేయాలన్న నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారనుంది. అంతకుముందు 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు ఈ ఆదాయం పంపిణీ అయ్యేది.
తాాజా నిర్ణయంతో జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో.. తక్కువగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ మొత్తంలో కేంద్రం కేటాయింపులు జరుగుతాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు అతి తక్కువ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది.
కేంద్రం నుంచి దక్కేది ఎంతంటే..
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ. జనాభా నియంత్రణ దిశగా ఇక్కడి ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. కానీ ఇప్పుడదే దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారడం శోచనీయం.
2011జనాభా లెక్కల ఆధారంగా గనుక ఆర్థిక సంఘం కేటాయింపులు జరిపితే.. రాష్ట్రాల నుంచి కేంద్రం వద్ద వసూలయ్యే పనుల్లో.. ప్రతీ రూ.100కి కేవలం రూ.5 లేదా అంతకంటే తక్కువ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు దక్కుతుంది.
అంటే, చిల్లర మాత్రమే దక్కుతుందన్నమాట. అదే సమయంలో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ కు రూ.18, బీహార్ కు రూ.10, మధ్యప్రదేశ్ కు రూ.8వరకు దక్కుతాయి.
నివేదిక రూపొందిస్తున్న టీఆర్ఎస్
దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు ఇది నష్టం చేకూర్చే విషయం. దీనిపై ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కేంద్రం మార్గదర్శకాలు అమలులోకి వస్తే తెలంగాణకు జరిగే నష్టంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమైంది.
నిరుత్సాపరచడం తగదు: ఈటెల
ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టారు. 'ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం తాయిలాలు ఇచ్చుకుంటే మాకేమి అభ్యంతరం లేదు.
కానీ దక్షిణాది రాష్ట్రాలకు ఏమి దక్కకుండా చేయడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాం. జాతీయ అభివృద్దికి ఎక్కువగా దోహదం చేస్తున్న రాష్ట్రాలను కేంద్రం నిరుత్సాహపరచడం తగదు. తక్కువ నిధులు ఇవ్వడం సరికాదు.' అని అభిప్రాయపడ్డారు.
ఇదో పనిష్మెంట్?
కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఒకవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు 'జరిమానా' లాగా తయారయ్యాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తక్కువ జనాభా ఉన్నందుకు ఇదే మీ మా శిక్ష అన్నట్టుగా కేంద్రం వ్యవహరించడం తగదంటున్నారు.