ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..
కరోనాతో పారాడుతోన్న గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొందరగా కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చేస్తోన్న ప్రార్థనలు మెల్లగా ఫలిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాధికి గురై, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని, డాక్టర్లు అందిస్తోన్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వెల్లడైంది.
షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్
ఎస్పీ చరణ్ తాజా వీడియో
దాదాపు నాలుగు వారాలుగా ఆస్పత్రిలో ఉన్న ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఒక దశలో తప్పుడు వార్తలు రాగా, అభిమానులు తల్లడిల్లిపోయారు. అప్పటి నుంచి ఆయన కొడుకు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్యంపై ప్రతిరోజూ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇటీవల జరిపిన టెస్టుల్లో గాయకుడికి కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయిందంటూ కొన్ని వెబ్ సైట్లు వార్తలు ప్రచురించగా, వాటిని చరణ్ ఖండించారు. తానుగానీ, ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు గానీ చెప్పేవే తప్ప మిగతా అనధికార సమాచారాన్ని నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలో తండ్రి ఆరోగ్యంపై చరణ్ మంగళవారం తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు.
ఇది నిజంగా శుభదినం..
‘‘ఈరోజు మా డాక్టర్లతో మాట్లాడాను. నాన్న ఆరోగ్య నిలకడగా ఉంది. చికిత్సకు ఆయన బాగా రెస్పాండ్ అవుతున్నారు. మీరు చూపుతోన్న ప్రేమాభిమానాలకు, ఆశీర్వాదాలకు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంది. ఎంజీఎం ఆస్పత్రి డాక్టర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాన్న కోలుకోడానికి వాళ్లు నిరంతరం శ్రమించారు. ఆయన త్వరలోనే మామూలు స్థితికి వస్తారని విశ్వసిస్తున్నాను. నా అప్ డేట్స్ ఫాలో అవుతున్నవాళ్లకు ఇది నిజంగా శుభదినం అనే చెప్పాలి'' అని చరణ్ ఉద్వేగంగా చెప్పారు.
అభిమానులకు మరో సందేశం..
బాలు అభిమానులను ఉద్దేశించి మరో విషయమంటూ చరణ్ కొన్ని మాటలు చెప్పారు. ఎస్పీబీ ఆరోగ్యం గురించి తమిళంలోనూ అప్ డేట్స్ పెట్టమని అడుగుతున్నారని, అయితే తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ పాటలు పాడిఉండటంతో దేశవ్యాప్తంగా ఎస్పీబీకి అభిమానులున్నారని, అన్ని భాషల్లోనూ అప్ డేట్స్ పెట్టడం కష్టసాధ్యమని, పైగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్న కారణంగా సమయం కూడా సరిపోవడం లేదని చరణ్ వివరించారు. ఇంగ్లీష్ రానివాళ్లు తెలిసిన వాళ్ల ద్వారా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
బొటనవేలితో బాలు సైగలు..
‘‘నన్ను చూసి నాన్న గుర్తుపట్టారు. మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఎలా ఉన్నారని అడిగితే.. బాగున్నాననే సంకేతంగా బొటనవేలు పైకెత్తి(థంమ్సప్) చూపించారు. ఆ తర్వాత నేను ఎలా ఉన్నానని అడిగారు. అమ్మ ఎలా ఉందంటూ సైగల ద్వారా అడిగారు. చాలారోజుల తర్వాత నాన్నను ప్రత్యక్షంగా చూడడం సంతోషం కలిగించింది. నన్ను చూసి ఆయన కూడా ఆనందించి ఉంటారు. అభిమానులు మీకోసం ప్రార్థనలు చేస్తున్నారని ఆయనకు చెప్పాను. నాన్న కచ్చితంగా కోలుకుని తిరిగి వస్తారు'' అని సోమవారం రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ఎస్పీ చరణ్ తెలిపారు.
ఎస్పీ బాలు 54ఏళ్ల కళాప్రస్థానం - సుగుణాలు నేర్పారన్న విజయశాంతి - తమిళనాడు సర్కార్ కీలక ప్రకటన