గానగంధర్వుడి గొంతు మూగబోయింది... బాలు నీ పాటల రూపంలో ఎప్పుడూ బతికే ఉంటావ్..!
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... పాటల రారాజు... తన గొంతునుంచి జాలువారిన ప్రతి పాట ఓ మధురమే. ఏడుస్తున్న చంటిపిల్లాడిని నిద్రపుచ్చాలంటే ఆయన పాట వినిపిస్తే చాలు. ఘంటసాల లేనిలోటు భర్తీ చేస్తూ తెలుగువారిని ఓలలాడించిన గానామృతం ఆయనది. ఆ గళంలో పలకని రాగం లేదు ..భావం లేదు. ఆహ్లాదకరంగా ఎంతో వినసొంపుగా సాగిపోయే పాటలతో సంగీత అభిమానులను రసగంగలో ముంచెత్తారు. అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే బాలు గొంతు మూగబోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుదిశ్వాస విడిచారు.
చిన్నప్పటి నుంచే పాటలంటే బాలుకు ఇష్టం
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ...తెలుగుపాటల్లోనే కాదు... ఇతర భాషల పాటల్లో కూడా కొత్త ఒరవడులు సృష్టించి సినీ సంగీతాన్ని పరవళ్లు తొక్కించాడు ఈ డెబ్బై నాలుగేళ్ల బాలుడు. చిన్నపటి నుంచే బాలుకు పాటలన్నా పాడటమన్న చాలా ఇష్టం. చిన్న వయస్సులోనే పాటల పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతుల ఎగురేసుకుపోయాడు. అందరిలానే బాలసుబ్రహ్మణ్యం తండ్రి శ్రీపతి సాంబమూర్తి తన కొడుకును ఇంజనీర్ చేద్దామని భావించాడు. సంగీత సరస్వతి కటాక్షం సంపూర్ణంగా ఉన్న ఆ పిల్లవాడు ఇంజనీర్ ఎలా అవుతాడు. గానగంధర్వుడు అయ్యాడు.
మూడు తరాల హీరోలకు పాటలు
అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు.. అప్పటి అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఇప్పటి అక్కినేని నాగచైతన్యవరకు..మూడు తరాల హీరోలకు పాటలు పాడే అవకాశం దక్కింది ఒక్క బాలుకే. ప్రపంచంలో మరే గాయకుడికి దక్కని అదృష్టమిది. అలాగని స్వరంలో ఏదైనా తేడా వచ్చిందా... అదే మాధుర్యం..అదే తియ్యదనం. ఏహీరోకు ఆహీరో వాయిస్ సూట్ అయ్యేలా బాలసుబ్రహ్మణ్యం గొంతులు మార్చి పాడగల ఘనాపాఠీ.
గాన గంధర్వుడు బాలు
ఒకరికా.. ఇద్దరికా.. ఎంతో మంది సీనియర్ నటులకు, సపోర్టింగ్ ఆర్టిస్టులకు బాలు గాత్ర దానం చేశారు. నందమూరి తారక రామరావుకి పాడితే అచ్చంగా ఆయన పాడినట్లే ఉంటుంది. అదే అక్కినేని నాగేశ్వరరావుకి పాడితే నిజంగా ఆయనే పాడినట్లుంటుంది. అలాగే కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలకు, అల్లు రామలింగయ్య, రాజబాబు, సుత్తివేలు, మాడా.. వంటి నటులకూ బాలు వారి గాత్రాన్ని ఇమిటేట్ చేస్తూ అలాగే పాడేవారు. ఎంతో మంది హీరోలు వచ్చారు..వారి వారసులు వచ్చారు.. వారు మారినా వాళ్లకి పాటలు పాడిన బాలు స్వరం మాత్రం మారలేదు. అదే జోరు అదే హుషారు. ఆ కంఠంలో యూత్ఫుల్నెస్ ఏమాత్రం తగ్గలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తన గొంతును సవరించుకుంటూ పాటకు మరింత స్వీట్నెస్ అద్దగలిగే టాలెంట్ ఈ ఒక్క స్వరరాజుకు మాత్రమే సాధ్యం.
ఆరు జాతీయ అవార్డులు బాలు సొంతం
ఒకే రోజున తమిళంలో 19 పాటలు, కన్నడంలో 17 పాటలు పాడి గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదుచేసుకున్నారు బాలు. ఇక ఆ గానగాంధర్వుని ప్రతిభకు వరించిన అవార్డులు, రివార్డులకు అంతే లేదు. భారత ప్రభుత్వం 2011లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో ఈ గానగాంధర్వుడిని సత్కరించింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్నివ్వగా, తమిళనాడులోని సత్యభామ యూనివర్సిటి మరో గౌరవ డాక్టరేట్నిచ్చి సత్కరించింది. 1979లో శంకరాభరణం, 1983లో సాగర సంగమం, 1988లో రుద్రవీణతో పాటు మిగత భాషల చిత్రాల్లో పాడినందుకు గాను ఆయనకు ఆరు జాతీయ అవార్డులు లభించాయి.
నటుడిగా కూడా సక్సెస్
ఇక నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి అందులోనూ తన ప్రతిభ చూపారు ఎస్పీబీ. తండ్రి పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రేమికుడు చిత్రంలో ప్రభుదేవ తండ్రిగా బాలు నటన అద్భుతం అనే చెప్పాలి. దేవస్థానం, మిథునం వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. గాయకుడుగా, సంగీత దర్శకుడుగా, నటుడుగా, చిత్ర నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, కోదండపాణి థియేటర్ అధినేతగా ఎన్నో రంగాల్లో రాణించారు.ఎన్నో యుగళగీతాలు,మరెన్నో ప్రణయనాధాలు, ఇంకెన్నో భక్తిభావాలు, చెప్పలేనన్ని విరహ వేదనలు.. ఎన్నెన్నో చిలిపి స్వరాలు, నవ రసాలు ఊరించే ఆ గాత్రం ఎల్లలు లేకుండా సాగిపోయింది. అనారోగ్యంను జయించి తిరిగి మరింత కాలాలపాటు మధురమైన సంగీతంతో వీనులవిందు చేస్తారని భావించిన వారందరికీ బాలు షాక్ ఇచ్చారు.... ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోవడాన్ని యావత్ సంగీత ప్రపంచంతో పాటు ఇటు సినీ పరిశ్రమ అటు సంగీత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.