త్యాగానికి సిద్ధం..2019లో ఎస్పీ బీఎస్పీలు కలిసే పోటీచేస్తాయి: అఖిలేష్
ఉత్తరప్రదేశ్లో తాజాగా జరిగిన ఉపఎన్నికల విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు ఎస్పీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. బీఎస్పీతో మద్దతుతో ఉపఎన్నికల్లో విజయబాహుటా ఎగురవేసిన సమాజ్ వాదీ పార్టీ...2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. మాయావతి పార్టీతో పొత్తు కొనసాగుతుందని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా కొన్ని సీట్లను త్యాగం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అఖిలేష్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో రాష్ట్రంలో బీజేపీ ఓటమే తమ అంతిమ లక్ష్యం అన్నారు అఖిలేష్.
ఉత్తర్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో వరసగా జరిగిన ఉపఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకుంది. బలమైన కమలం పార్టీని మట్టుబెట్టేందుకు బద్ద శత్రువులైన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు చేతులు కలపడంతో... యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్కు చెందిన గోరఖ్ పూర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పూల్ పూర్ లోకసభ స్థానం కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా కైరానా పార్లమెంటు స్థానాన్ని సైతం విపక్షాలు తమ ఖాతాలో వేసుకోవడంతో ... ఇదే ఫార్ములాను 2019లో కూడా కొనసాగించాలని ఎస్పీ బీఎస్పీ పార్టీలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే... బీఎస్పీకి తాము అనుకున్న సీట్లు ఇస్తే ఎస్పీతో కలిసి వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మాయావతి తెలిపారు. బీజేపీని ఓడించడమే ప్రస్తుతం తమ ముందున్న టార్గెట్గా చెప్పుకొచ్చారు. మరోవైపు ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఒక కొలిక్కి రాదని..2019 ఎన్నికలకు ముందే అఖిలేష్, మాయావతిల మధ్య విబేధాలు వచ్చి విడిపోతారని ఆ రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య జోస్యం చెప్పారు.