ఎస్పీ- బీఎస్పీ ఐక్యతకో పరీక్ష.. వచ్చేనెలలో యూపీ కౌన్సిల్ ఎన్నికలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనమండలికి వచ్చేనెలలో జరుగనున్న ఎన్నికలు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) - బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఐక్యతకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు మోహ్సిన్ రాజా, మహేంద్ర సింగ్లతోపాటు మొత్తం 12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం మే ఐదో తేదీన ముగియనున్నది. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపిస్తే శాసనమండలిలో రెండు స్థానాల్లో అభ్యర్థుల గెలుపునకు సహకరిస్తానని ఎస్పీకి, మాయావతి హామీ ఇచ్చారు.
కానీ రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినా బీఎస్పీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో మాయావతి తన నిర్ణయాన్ని పున: పరిశీలించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 402 స్థానాలు గల అసెంబ్లీలో శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందడానికి 33 ఓట్లు కావాలి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 324 మంది సభ్యుల బలం ఉన్నది.
స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ మరొకరి గెలుపునకు అవకాశం
అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాల ప్రకారం తొమ్మిది స్థానాల్లో బీజేపీ సునాయసంగా గెలుపొందేందుకు వీలవుతుంది. కాగా మరో 27 ఓట్లు మిగులుతాయి. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో మరో ఎమ్మెల్సీని కూడా బీజేపీ గెలుచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీఎస్పీ ఎమ్మెల్యే అనిల్ సింగ్, ఎస్పీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ బీజేపీలోకి ఫిరాయించడంతో కమలం పార్టీ బలం 29కి చేరుకున్నది.
బీఎస్పీ మద్దతుతో ఎస్పీ మరో ఎమ్మెల్సీ ఎన్నికకు చాన్స్
ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీకి 46 మంది సభ్యుల బలం ఉన్నందున ఒక స్థానాన్ని గెలుచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. మరో 13 ఓట్లతోపాటు బీఎస్పీ 18 మంది, కాంగ్రెస్ ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతుతో మరొక సీటు గెలుచుకునేందుకు వీలు కలుగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతునిచ్చామని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి గుర్తు చేశారు. దానికి ప్రతిగా మండలి ఎన్నికల్లో బాసటగా నిలుస్తామని ఆమె హామీ ఇచ్చారన్నారు.
కౌన్సిల్ ఎన్నికల్లో మద్దతుపై మాయావతిదే నిర్ణయమన్న బీఎస్పీ
శాసనమండలి నుంచి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తోపాటు రాజేంద్ర చౌదరి కూడా రిటైర్ కానున్నారు. కౌన్సిల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ ఇంకా ఖరారు చేయలేదని, అయినా అందుకు చాలా సమయం ఉన్నదని రాజేంద్ర చౌదరి అన్నారు. కౌన్సిల్ ఎన్నికల్లో మద్దతుపై మాయావతి నిర్ణయమేమిటో ముందుకు తెలుసుకోవాల్సి ఉన్నదని బీఎస్పీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
నలుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపుతో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు
రిటైరవుతున్న 12 మంది ఎమ్మెల్సీల్లో ఏడుగురు ఎస్పీ వారే. దీంతో శాసనమండలిలో ఎస్పీ బలం 61 నుంచి 54 స్థానాలకు పడిపోతుంది. ఏ రకంగా చూసినా బీఎస్పీ మద్దతుతోనే ఎస్పీ మరో ఎమ్మెల్సీని గెలుచుకోగలదు. ఇక బీఎస్పీ ఎమ్మెల్సీలు సునీల్ చిత్తూర్, విజయ్ ప్రతాప్ రిటైర్మెంట్తో కౌన్సిల్ లో ఆ పార్టీ బలం తొమ్మిది నుంచి ఏడుకు పడిపోనున్నది. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ, నిషాద్ పార్టీలకు చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే బీజేపీకి మద్దతునివ్వడంతో బీఎస్పీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
అంగ, అర్థబలంతో రాజ్యసభ ఎన్నికల్లో 9 స్థానాల్లో బీజేపీ గెలుపు
గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ గెలుపొందడంతో బీజేపీ ఖంగు తిన్నది. దీనికి రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీల నుంచి ఒక్కో ఎమ్మెల్యే, ఆర్ఎల్డీ, నిషాద్ పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుని తొమ్మిదో రాజ్యసభ స్థానాన్ని కమలనాథులు గెలుచుకున్నారు. ఫలితంగా బీఎస్పీ అభ్యర్థి బీ అంబేద్కర్ ఓటమి పాలయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఓటమికి బీజేపీదే బాధయత అని ఆరోపించారు. డబ్బు వెదజల్లి, అంగ, అర్ధబలాన్ని ప్రదర్శించి తొమ్మిదో స్థానాన్ని గెలుచుకున్నదని మండి పడ్డారు.
ఎస్పీతో కలిసి 2019లో బీజేపీని ఓడిస్తామన్న మాయావతి
సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు కట్టుబడి ఉన్నాయని పేర్కొనడం ద్వారా భవిష్యత్లో కూటమి ఎటూ చెక్కు చెదరలేదని సంకేతాలిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమి పాలైనా.. 2019 ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసి, బీజేపీని ఓడిస్తామని మాజీ సీఎం మాయావతి ప్రతీన బూనడం గమనార్హం. 19 మంది ఎమ్మెల్యేలు గల బీఎస్పీ సొంతంగా రాజ్యసభ సీటు గెలుచుకునే స్థితిలో లేదు. మరోవైపు బీజేపీ ఎనిమిది మందిని గెలిపించుకోగా 28కి పైగా ఓట్లు మిగిలాయి.
బీఎస్పీకి పూర్తిగా బాసట నిలిచిన ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు
బీఎస్పీ గెలుపొందాలంటే 20 అదనపు ఓట్లు కావాల్సి ఉండగా, కమలనాథులు కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది ఓట్లు పొందగలిగితే చాలు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతోనే బీఎస్పీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ముక్తార్ అన్సారీ జైలులో ఉండగా, అనిల్ సింగ్ బీజేపీలోకి ఫిరాయించడంతో బీఎస్పీ బలం 17కు పడిపోయింది. ఒకవేళ బీఎస్పీకి తొలి ప్రాధాన్య ఓటు కింద 32 ఓట్లు పడి ఉంటే అందులో 16 కాంగ్రెస్ - ఎస్పీలవే. ఎస్పీ నుంచి తొమ్మిది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు బీఎస్పీకి ఓటేశారు.
విజయోత్సవాలు రద్దు చేసిన అఖిలేశ్
ఎస్పీ తరఫున పోటీ చేసిన జయాబచ్చన్ గెలుపొందడానికి 37 ఓట్లు మాత్రమే అవసరం కాగా, ఆమె 38 ఓట్లు పొందారు. అజిత్ సింగ్ మద్దతునిస్తామని హామీ ఇచ్చినా ఆయన సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) ఎమ్మెల్యే, నిషాద్ పార్టీ ఎమ్మెల్యే, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడంతో బీజేపీ అభ్యర్థి అనిల్ అగర్వాల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మారిన పరిస్థితుల్లో భవిష్యత్ రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జయాబచ్చన్ విజయోత్సవాలను జరుపుకోవాలని ముందుగా నిర్ణయించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తర్వాత రద్దు చేసేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో మాదిరిగా ఎస్పీ, బీఎస్పీ మధ్య విభేదాలపై ఆశలు
గమ్మత్తేమిటంటే రాజ్యసభ ఎన్నికల్లో తొమ్మిదో అభ్యర్థి గెలుపొందిన తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విధానసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ బీఎస్పీకి ఎస్పీ వెన్నుపోటు పొడిచిందని ఎదురుదాడికి దిగారు. ఎస్పీ తాను పొందిన దానికి ఏనాడు ప్రతిఫలం ఇతరులకు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్ సభ స్థానాల్లో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ గెలుపొందిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో మాదిరిగా హామీలు అమలు కాకుంటే ఎస్పీ, బీఎస్పీ మధ్య విభేదాలు పొడసూపి, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు.
బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తామన్న ఎస్పీ చీఫ్
ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఎస్పీ బీఎస్పీ ఐక్యత బలోపేతమైందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి భీంరావ్ అంబేద్కర్పై జరిగిన ముఖాముఖి పోటీలో అధికార దుర్వినియోగంతో, అర్ధబలంతో బీజేపీ అభ్యర్థి అనిల్ అగర్వాల్ గెలుపొందడం వెనుక కమలనాథుల దళిత వ్యతిరేక వైఖరి, అసలు స్వరూపం బయటపడిందన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని ప్రజల ముందు మరింత బహిర్గతం చేస్తామని తెలిపారు.
బీజేపీ నేతలు వారసులను ప్రోత్సహించొద్దని సూచన
వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్సింగ్, సీఎంలు రమణ్సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఎస్పీ నాయకత్వం బంధుప్రీతికి ప్రాధాన్యం ఇస్తున్నదని ఆరోపిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో తన భార్య డింపుల్ యాదవ్ పోటీ చేయకపోవచ్చునన్నారు. బీజేపీ నేతలు కూడా అందుకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.
గోరఖ్పూర్, ఫూల్పూర్ స్థానాల ఫలితాలతో పరిస్థితిలో మార్పు
యూపీలో శాంతిభద్రతల పరిస్థితి కుప్పకూలిందని అఖిలేశ్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ఇందులో భాగస్వాములైన వారు తప్పించుకోలేరని, త్వరలో దర్యాప్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాల ఉప ఎన్నికల్లో గెలుపొందడం పెద్ద విజయమని, 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించవచ్చునని జాతికి సందేశమిచ్చాయని అన్నారు.
లాలూ బంధువు మాత్రమే కాదు బడా నేత అని వ్యాఖ్య
కాంగ్రెస్తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తు విషయం చర్చకు వస్తుందని ఎస్పీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. పశుగ్రాసం కేసులో జైలుపాలైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనకు బంధువు మాత్రమే కాదని, బీహార్ రాష్ట్రంలో మతతత్వవాదులు అడుగు పెట్టకుండా నిలువరించిన బడా నేత అని అఖిలేశ్ యాదవ్ గుర్తు చేశారు.
కూటమి ఏర్పాటు యత్నాలకు తిలోదకాలు ఇవ్వడం సరికాదని వ్యాఖ్య
రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి వల్ల దిగ్భ్రాంతికరమైన అంశమేమీ లేదని అఖిలేశ్ యాదవ్, మాయావతి భావిస్తున్నట్లు సమాచారం. రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత.. రాజ్యసభ ఎన్నికల ఫలితాల సాకుతో ఎస్పీ, బీఎస్పీ కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలకు తిలోదకాలివ్వడం తెలివైన పని కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.