
ఈవీఎంల దొంగలు బీజేపీ నేతలు ?.. వారణాసిలో పట్టుబడ్డ ఓటింగ్ యంత్రాల ట్రక్కు! : యోగిపై అఖిలేశ్ కన్నెర్ర..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 10 వ తేదీ వెలువడనున్నాయి. గెలుపుపై ప్రధాన పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది.. ఇక్కడ ప్రధానంగా పోటీ అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షపార్టీ ఎస్పీపైనే నెలకొంది. మరోసారి అధికారం తమదేనని కషాయ దళం అంటోంది. అటు ఈసారి యోగిని ఇంటికి పంపించడం ఖాయమని ఎస్పీ గట్టిగా సవాల్ విసురుతోంది.

ఈవీఎంలను దొంగలిస్తున్నారు..
ఈనేపథ్యంలో బీజేపీపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి కాషాయం నేతలు ఈవీఎంలను దొంగలిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అధికార పార్టీతో ప్రభుత్వాధికారులు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల నిబంధలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఈవీఎంలను ట్రక్కుల్లో తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకు సాక్ష్యం.. వారణాసిలో పట్టుబడిన ఓటింగ్ యంత్రాలతో కూడిన ట్రక్కే నిదర్శనమన్నారు.. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.

ఈవీఎంలు ట్యాంపరింగ్
ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. తమకు ఎన్నికల సంఘంపై ఏమాత్రం నమ్మకం లేదని విమర్శించారు. బీజేపీ ఓడిపోయే చోట్ల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత నెమ్మదిగా నిర్వహించేలా కింది స్థాయి అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయని ఆరోపించారు. కౌంటింగ్ రోజు ఎస్పీ కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే చివరి అస్త్రమని పేర్కొన్నారు. ఎన్నికల్లో అవకతవలపై తాము న్యాయస్థానానికి వెళ్తామని చెప్పారు.

బీజేపీదే అధికారం..
మరోవైపు ఉత్తరప్రదేశ్లో మరోసారి కాషాయ జెండాదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఎస్పీ మరలా ప్రతిపక్షహోదాకు పరిమితమవుతుందని తెలిపాయి. కాంగ్రెస్, బీఎస్పీలకు పరాభవం తప్పదని పేర్కొన్నాయి. అయితే ఈ సారి ఎస్పీ గతంలో కంటే మెరుగైన స్థానాలను సొంతం చేసుకుంటుందని తేలింది. బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గినా అధికారాన్ని మాత్రం మరలా చేపడుతుందని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిల్ పోల్స్ ఫలితాలపై బీజేపీ నేతలు జోష్లో ఉన్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా ఫలితాలు రానున్నాయా.. లేదా తల్లకిందులవుతాయా అన్నది ఈనెల 10వ తేదీన తేలనుంది.