యూపీలో ఎస్పీ-బీఎస్పీ మధ్య కుదిరిన సీట్ల లెక్క: రెండు కీలక స్థానాలు వారికి వదిలేశారు
లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య పొత్తులు, సీట్ల లెక్కలు కొలిక్కి వస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, అలాగే డీఎంకే, కాంగ్రెస్ పొత్తు కొలిక్కి వచ్చింది. లోకసభ ఎన్నికలకు ఉత్తర ప్రదేశ్ ఎంతో కీలకం. ఇక్కడ 80 సీట్లు ఉన్నాయి. బీజేపీ చిన్న చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది. కాంగ్రెస్ ఒంటరి పోరుకు దిగుతోంది.
ఎస్పీ 37, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ
ఎస్పీ, బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. తాజాగా, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై కూడా ఇరు పార్టీల అధినేతలు అఖిలేష్ యాదవ్, మాయావతిలు నిర్ణయానికి వచ్చారు. రానున్న లోకసభ ఎన్నికల్లో ఎస్పీ 37, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనుంది. 80 స్థానాలకు గాను ఈ రెండు పార్టీలు 75 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి.
వారికి సీట్లు వదిలేశారు
రాహుల్ గాంధీ పోటీ చేసే అమేథి, సోనియా గాంధీ పోటీ చేసే రాయ్బరేలి నియోజకవర్గాల నుంచి తమ తమ పార్టీల నుంచి ఎవరినీ నిలబెట్టవద్దని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోయినప్పటికీ వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. మరో మూడు లోకసభ స్థానాలు మిగులుతాయి. వాటిలో మరో మిత్రపక్షం రాష్ట్రీయ లోక్దళ్కు ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ పార్టీ అధినేత అజిత్ సింగ్.
ఈ కీలక స్థానాల్లో ఈ పార్టీ పోటీ
ఎస్పీ పోటీ చేయనున్న 37 స్థానాల్లో కైరానా, మోరాబాద్, సంభాల్, రాంపూర్, మోయిన్పురి, ఫిరోజాబాద్, బుదౌన్, బరేల్లీ, లక్నో, ఇటావా, కాన్పూర్, కనౌజ్, ఝాన్సీ, బాందా, అలహాబాద్, కౌషంబి, ఫుల్పూర్, ఫైజాబాద్, గోండా, ఘోరక్పూర్, అజంగర్, వారణాసి, మిర్జాపూర్ నియోజకవర్గాల ఉన్నాయి. బీఎస్పీ పోటీ చేయనున్న 38 స్థానాల్లో షహరాన్పూర్, బిజ్నోర్, నగినా, అలీఘర్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, సితాపూర్, సుల్తాన్పూర్, ప్రతాప్ఘర్, బస్తి, సాలెంపూర్, బదోనీ తదితర నియోజకవర్గాల ఉన్నాయి.